భైంసాటౌన్, అక్టోబర్ 3 : నిర్మల్ జిల్లా భైంసా మండలం పాంగ్రి గ్రామ ఎక్స్ రోడ్డు నుంచి చుచుంద్ వరకు రూ.3 కోట్ల 15 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. రహదారులతోనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని భావించి సీఎం కేసీఆర్ బీటీ రోడ్లు వేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, పంచాయతీలు ఉత్తమ అవార్డులు అందుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శివాలయంలో పూజలు చేసి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు, గృహలక్ష్మి తదితర పథకాలు నిరంతర ప్రక్రియ అన్నారు. అర్హులందరికీ లబ్ధి చేకూరే వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో నాయకులు మేరాజ్, పోతన్న, శంకర్, ఉత్తమ్ బాలేరావ్, పోతాజీ, గంగాధర్, గంభీర్, విశ్వనాథ్, నాగన్న, ప్రకాశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.