ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 148 నర్సరీల్లో 11.80 లక్షల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవీ 18 వేల ఎకరాలకు సరిపోతాయి.
దక్షిణ అమెరికా నుంచి కొస్టాలికా, థాయిలాండ్ నుంచి సిరాడ్, మలేషియా నుంచి యూనివానిచ్ అనే రకాల విత్తనాలు దిగుమతి చేసుకున్నారు.
పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పంట ప్రారంభమైన వెంటనే కొనుగోలు చేస్తాయి.
ఒక్కో మొక్క ధర రూ.193 ఉండగా.. ఇందులో రైతు రూ.20 చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.173 భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సరఫరా చేస్తారు.
ఒక ఎకరంలో సాగు చేయడానికి రైతుకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఖర్చవుతాయి. ఆదాయం రూ.1.50 లక్షలు వస్తుంది. ఖర్చులు పోనూ దాదాపు రూ.1.30 లక్షలు మిగులుతాయి.
అంతర పంటగా పసుపు, మిర్చి, కూరగాయలు, మక్క, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పెసళ్లు, మినుములు, పప్పుదినుసులు, పత్తి వేసుకోవచ్చు.
మంచిర్యాల జిల్లాలో రోజు 75-80, నిర్మల్లో 120-150, ఆదిలాబాద్లో 45-60 మంది ఉపాధి పొందుతున్నారు. మహిళలకు రూ.340, పురుషులకు రూ.450 కూలీ చెల్లిస్తున్నారు.
ఆయిల్ పామ్.. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నూనె తీయగా వచ్చిన వ్యర్థాలను మొక్కలకు ఎరువుగా, జీవ ఇంధనంగా, మల్చ్గా వినియోగిస్తారు. ఐస్క్రీములు, సౌందర్య ఉత్పత్తులు, బేకరీ పదార్థాలలో వినియోగిస్తారు.
“సంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి.. పండించే పంట లాభాలు తెచ్చి పెట్టాలి.. రైతులు ధనవంతులు కావాలి..” అనే సంకల్పంతో సర్కారు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టింది. మన వద్ద నీరు పుష్కలంగా లభ్యమవుతుండడంతో వరి వైపు మొగ్గు చూపుతున్న రైతులు.. ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగు విస్తృతంగా పెంచుతున్నారు. నేలలు అనువుగా ఉండడం, సర్కారు ఉచిత కరంటు ఇస్తుండడం, ఒక్కసారి పెట్టుబడి పెడితే 30 ఏండ్లు ఆదాయం వస్తుండడం, అంతర పంటలతో ఆదాయం సమకూరే అవకాశం ఉండడం వంటి వాటితో ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం 4,045 ఎకరాల్లో తోటలు సాగవుతుండగా.. వచ్చే మార్చి నాటికి 13,263 ఎకరాలు సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 10వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లాలో 148 నర్సరీలు ఉండగా.. 11.80 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు.
మంచిర్యాల, నవంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పుష్కలమైన సాగునీరు అందుబాటులోకి వచ్చింది. అప్పటివరకు తడారిన భూములను ముద్దాడిన సాగునీటిని చూసి మురిసిన రైతన్నలు పుష్కలంగా వరి వేశారు. దీంతో వరి సాగులో దేశంలోనే తొలిస్థానంలో ఉన్న పంజాబ్ను వెనక్కినెట్టి.. తెలంగాణ రికార్డు స్థాయిలో వరిసాగు చేసింది. చేతికి వచ్చిన పంటతో గోదాములన్నీ కళకళలాడాయి. మరి కొన్నేళ్లు పరిస్థితి ఇలాగే ఉంటే ధాన్యం దిగుబడి పెరిగి, డిమాండ్ తగ్గుతుంది.. అదే జరిగితే ఇప్పుడిప్పుడే బాగు పడుతున్న రైతులు బతకడమే కష్టమైతది. ఇలా దూరదృష్టితో ఆలోచించిన సీఎం కేసీఆర్ ఈ పరిస్థితి మార్చేందుకు ఇతర పంటలు ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని వ్యవసాయ అధికారుల ద్వారా రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించారు.
అలా ఓ ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ను ఎంపిక చేశారు. రాష్ట్రంలో నూనె ఉత్పత్తులను పెంచడంతోపాటు రైతులకు మేలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17,308 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇందులో ఇప్పటికే 4,405 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయ్యింది. మిగిలిన లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో 48 ఎకరాల్లో నర్సరీ ఉండగా.. ఐదు లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇవీ మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఎనిమిది వేల ఎకరాలకు సరిపోతాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బీరవెళ్లి నర్సరీలో 80 ఎకరాల్లో 4.80 లక్షల మొక్కలు ఉండగా.. ఏడు వేల ఎకరాల్లో నాటొచ్చు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ శివారులోని మధ్నార్లో 20 ఎకరాల్లో నర్సరీ ఉండగా.. రెండు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇవీ మూడు వేల ఎకరాలకు సరిపోతాయి.
మూడు జిల్లాల్లో నర్సరీలు.. లక్షల సంఖ్యలో మొక్కలు సిద్ధం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతు న్నది. ఇప్పటివరకు 4,045 ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇంకా.. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో 48 ఎకరాల్లో నర్సరీ ఉండగా.. ఐదు లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇవీ మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఎనిమిది వేల ఎకరాలకు సరిపోతాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బీరవెళ్లి నర్సరీలో 80 ఎకరాల్లో 4.80 లక్షల మొక్కలు ఉండగా.. ఏడు వేల ఎకరాల్లో నాటొచ్చు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ శివారులోని మధ్నార్లో 20 ఎకరాల్లో నర్సరీ ఉండగా.. రెండు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇవీ మూడు వేల ఎకరాలకు సరిపోతాయి. మన ఉమ్మడి జిల్లాతోపాటు పొరుగు జిల్లాలకు కూడా మొక్కలు పంపిణీ కానున్నాయి. డిసెంబర్ చివరి నాటికి అవసరమైన లక్ష్యానికి మించి మొక్కలను సిద్ధం చేస్తామని నర్సరీల నిర్వాహకులు తెలుపుతున్నారు.
మూడు దేశాల నుంచి విత్తనాలు..
ఆయిల్ పామ్ విత్తనాలు మూడు దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దక్షిణ అమెరికా నుంచి కొస్టాలికా, థాయిలాండ్ నుంచి సిరాడ్, మలేషియా నుంచి యూనివానిచ్ అనే రకాల విత్తనాలు వస్తున్నాయి. ఈ విత్తనాలను నర్సరీల్లో రెండు దశల్లో పెంచుతున్నారు. ప్రాథమిక దశలో ప్రత్యేకమైన షెడ్లు ఏర్పాటు చేసి చిన్న బ్యాగుల్లో విత్తనాలు నాటుతారు. ఆ విత్తనాలు మొలకెత్తడానికి అనువైన వాతావరణం, నీడ, నీటి వసతి కల్పిస్తారు. ఇక్కడ ఉచిత విద్యుత్, అనువైన నేలలు ఉండడం కలిసొచ్చే అంశం. ఇందులో ఒక్కో మొక్క మూడు నెలలు ఉంటుంది. అనంతరం ఆ మొక్కలను షెడ్డు నుంచి తీసి పెద్ద బ్యాగుల్లోకి మారుస్తారు. ఇలా షెడ్డు బయట తొమ్మిది నెలలపాటు ఉంచుతారు. మొత్తం 12 నెలలు దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఇలా చేతికొచ్చిన వాటిలో 10 నుంచి 15 శాతం పనికిరానివి ఉంటాయి. ఉద్యానవన శాఖ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారులు, హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల బృందం పనికి రాని మొక్కలను గుర్తిస్తారు. అవి మినహా మిగిలిన వాటిని రైతులకు పంపిణీ చేస్తారు.
వందలాది మందికి ఉపాధి..
ఆయిల్ పామ్ నర్సరీల్లో రోజూ వందల మంది కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. భీమారం నర్సరీలో భీమారం, పోతనపల్లి, నీలాయిపల్లి, ధర్మారం, రాంపూర్, చెన్నూరు, కాజీపల్లి నుంచి రోజు 75 నుంచి 80 మంది కూలీలు వస్తున్నారు. నిర్మల్లో రోజు 120 నుంచి 150, ఆదిలాబాద్లో 45 నుంచి 60 మంది ఉపాధి పొందుతున్నారు. మహిళలకు రూ.340, పురుషులకు రూ.450 కూలీ చెల్లిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పని చేయాల్సి ఉంటుంది. బ్యాగుల్లో మట్టి నింపడం, మొక్కలకు ఎరువులు వేయడం, నీరు అందుతుందా? లేదా చూడటం లాంటి పనులు చేయిస్తారు. రైతులు మొక్కల కోసం వచ్చినప్పుడు వాహనాల్లో ఎక్కిస్తామని కూలీలు తెలిపారు. ఇంకా.. ఆయిల్ పామ్ సాగు పెరిగితే ఇండస్ట్రీ నెలకొల్పే అవకాశం ఉంది. దీనితో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
అంతర పంటలు వేసుకోవచ్చు..
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు అంతర పంటగా పసుపు, మిర్చి, కూరగాయలు, మక్క, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పెసళ్లు, మినుములు, పప్పుదినుసులు, పత్తి వేసుకోవచ్చు. చీడపీడల ఇబ్బందులు ఉండవు. ఇతర పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులను 30 శాతం ఉపయోగిస్తే సరిపోతుంది. ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు చేస్తున్న పలువురు రైతులు అంతర పంటలు వేస్తున్నారు. దిగుబడిలోనూ ఎలాంటి తేడా ఉండదని చెబుతున్నారు.
ఎకరానికి 10 టన్నుల దిగుబడి..
ఆయిల్ పామ్ మొక్క నాటిన నాలుగేండ్ల నుంచి 30 ఏండ్ల వరకు దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 10 టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. ఒక్కో గెల బరువు 25 నుంచి 30 కిలోలు ఉంటుంది. ప్రతి 20 రోజులకు ఒకసారి గెలల కోత కొనసాగుతుంది. ఒక్కో చెట్టు నుంచి ఏడాదికి 8-12 గెలలు కోతకు వస్తాయి. మార్కెట్లో సరాసరి టన్ను ధర రూ.15 వేలు పలుకుతోంది. ఏడాదికి ఒక ఎకరానికి వచ్చే ఆదాయం రూ.1.50 లక్షలు. ఒక ఎకరానికి రైతులకు అయ్యే ఖర్చు చూస్తే రూ. 30 వేలు మాత్రం. అంటే ఎకరంలో నికర ఆదాయం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు గెలలు అమ్మిన తర్వాత సర్కారు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ డబ్బులు జమ చేస్తుంది. రైతులకు ఎక్కడ కూడా లోటు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.
సర్కారు ప్రోత్సాహం.. భారీ సబ్సిడీలు..
రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నది. నీటి యాజమాన్యాన్ని ప్రోత్సహించేందుకు బిందు సేద్యం పద్ధతిలో మైక్రోజెట్ల ద్వారా నీటిని అందించేందుకు ఉద్యానశాఖ ద్వారా రాయితీ ఇస్తున్నది. బిందు సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నది. బీసీ, ఓసీ రైతులకు ఐదెకరాల్లోపు 90 శాతం.. ఐదెకరాలు పైబడితే 80 శాతం సబ్సిడీని ఇస్తున్నది. అంతే కాకుండా మొక్కలు నాటిన నుంచి ఎరువులు, పురుగుల మందులు, నిర్వహణ ఖర్చుల కింద ప్రతి ఎకరాకు ఏటా రూ.2,100 చొప్పున నాలుగేళ్లపాటు రూ.8,400, అంతర పంటల ఖర్చుల నిమిత్తం ప్రతి ఎకరాకు ఏటా రూ.2,100 చొప్పున నాలుగేళ్లపాటు మరో రూ.8,400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.
ఆయిల్ పామ్ ప్రాముఖ్యత..
మంచి నూనె కొరత తీవ్రంగా ఉండడంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కొరతను తీర్చేందుకు అత్యధికంగా నూనె శాతాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా నూనె గింజల సాగుతో ఎకరానికి టన్ను నూనె ఉత్పత్తి చేస్తుండగా, ఆయిల్ పామ్ నుంచైతే ఒక హెక్టారుకు 4 నుంచి 5 టన్నుల నూనెను ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. పామాయిల్లో సాచురేటెడ్, ఆన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమతుల్యతలో ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్గా పని చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలోని లక్షణాలు స్థిరంగా ఉన్నందున అనేక రకాల వంటలకు ఈ ఆయిల్ను వినియోగిస్తారు. నూనె తీయగా వచ్చిన వ్యర్థాలను మొక్కలకు ఎరువుగా, జీవ ఇంధనంగా, మల్చ్గా వినియోగిస్తారు. ఐస్క్రిములు, సౌందర్య ఉత్పత్తులు, బేకరీ పదార్థాలలో వినియోగిస్తారు. ఎర్ర నేలలు, నీరు నిలవని నల్ల నేలలు ఈ సాగుకు అనుకూలం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ను ఒక ఉద్యమంలా చేపట్టాని నిర్ణయించింది.
ఆయిల్ పామ్తో అధిక లాభాలు..
ఆయిల్ పామ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కో ఎకరంలో రైతు 57 మొక్కలు నాటుతారు. ఒక్కో దాని ధర రూ.193 నిర్ణయించగా.. ఇందులో రైతులు రూ.20 చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.173 భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ కల్పిస్తున్నది. నర్సరీలు నిర్వహిస్తున్న ప్రైవేటు కంపెనీలు ఈ మొత్తం చెల్లిస్తారు. ఒక ఎకరంలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి రైతుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల ఖర్చవుతాయి. పంట వేసిన నాలుగో యేడాది నుంచి దిగుబడి వస్తుంది. తొలి పంటకు ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి, మరుసటి యేడాది ఆరు నుంచి ఏడు, ఆరో ఏడాది నుంచి 9 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో ఎకరాకు సమాంతర త్రిభుజాకార పద్ధతిలో తొమ్మిది మీటర్ల దూరంలో మొక్కలు నాటుతారు. ఒక్కో మొక్కకు 60 సెంటీమీటర్ల లోతు గుంత తీస్తారు. 1.2 మీటర్ల కంటే ఎత్తయిన మొక్కలు మాత్రమే నాటుతారు.
పదెకరాల్లో సాగు చేస్తున్న..
నాకున్న పదెకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న. మూడు నెలల క్రితం 570 మొక్కలు తెచ్చి నాటా. అంతరపంటగా పత్తి కూడా వేశా. మొక్కలు బాగా ఎదుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు. నా తమ్ముడు కూడా ఆరెకరాల్లో ఎనిమిది నెలల క్రితం మొక్కలు నాటాడు. ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి. మంచి దిగుబడి వస్తుందని అధికారులు చెప్పారు. దీనితోపాటు అంతర పంటలతో ఆదాయం బాగా వస్తుందని భావిస్తున్నా. – నరిగె బీరయ్య, రైతు, కాజీపల్లి.
నాలుగు రకాల అంతర పంటలు వేశా..
నేను పదెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రెండేళ్లు దాటింది. మొక్కలు ఆరు నుంచి పది ఫీట్ల వరకు పెరిగాయి. పోయిన ఏడాది, ఈ ఏడాది రెండు సార్లు గెలలు కూడా వేశాయి. అధికారుల సూచన మేరకు వాటిని తొలగించాం. ఇప్పటి వరకు నాలుగు అంతర పంటలు సాగు చేశా. పుచ్చకాయ, మక్క, బూడిద గుమ్మడి సాగు చేశాం. ఇప్పుడు పశువుల మేతకు ఉపయోగించే జొన్న వేశాం.
– బాపురెడ్డి, రైతు, చెన్నూరు.
యేడాదిగా వస్తున్నా
యేడాది నుంచి ఆయిల్ పామ్ నర్సరీలో పనికి వస్తున్న. రోజుకు రూ.340 ఇస్తున్నరు. వారానికి ఒకసారి కూలి డబ్బులు చెల్లిస్తారు. ఆదివారం మాత్రం పని ఉండదు. ఇలా గతేడాది దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించా. ఈ పని ఎప్పటికీ ఉంటే బాగుంటుంది. – సంధ్య, కూలీ, కాజీపల్లి.
మా ఇంటి నుంచి ఇద్దరం..
యేడాదిన్నరగా ఆయిల్ పామ్ నర్సరీలో పనికి వస్తున్న. నాతోపాటు మా తోటికోడలు కూడా వస్తున్నది. యేడాదిన్నరగా వ్యవసాయ పనులకు పోవడం లేదు. వ్యవసాయ కూలీగా చేయాలంటే ఒక రోజు పని దొరుకదు. ఒక రోజు దొరుకుతుంది. యేడాది మొత్తంలో మూడు నెలలు పని దొరకడమే కష్టం. ఇప్పుడు యేడాది పొడవునా రోజూ పని దొరుకుతున్నది. – సునీత, కూలీ, భీమారం.
మార్చి చివరి నాటికి పూర్తి
వచ్చే యేడాది మార్చి నాటికి టార్గెట్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. వ్యవసాయ అధికారుల సమన్వయంతో కలిసి పని చేస్తున్నాం. రైతులను ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. మొక్కలు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయి. నాటు కోవడమే మిగిలి ఉంది. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో లక్ష్యం పూర్తి చేస్తాం.
– సహజ, ఇన్చార్జి ఉద్యానశాఖ అధికారి, మంచిర్యాల