కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కౌటాల, ఫిబ్రవరి 23 : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టబోతున్నది. రూ. 10,578 కోట్ల భారీ అంచనాతో ఎనిమిది మండలాల్లోని 48 గ్రామాల మీదుగా సుమారు 63 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించబోతున్నది. 70 మీటర్ల వెడల్పుతో సుమారు 8 నుంచి 10 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అన్నారం గ్రామంలో ఈ రహదారి ప్రారంభమై.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం వీరవెల్లి గ్రామం మీదుగా పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించనున్నది.
జాతీయ రహదారికి ప్రాథమిక అంచనాల ప్రకారం 225 ఎకరాల నుంచి 270 ఎకరాల వరకు భూమి అవసరముంటుందని భావిస్తున్నారు. గడ్చిరోలి-కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు రెండు జిల్లాల ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది.
మంచిర్యాల జిల్లాలో 21 కి.మీ.. ఆసిఫాబాద్లో 42 కి.మీ..
మంచిర్యాల- ఆసిఫాబాద్ జిల్లాల్లో సుమారు 63 కిలోమీటర్ల మేర హైవే నిర్మా ణం జరుగనున్నది. మంచిర్యాల జిల్లాలో 21 కిలోమీటర్లు, కుమ్రం భీం ఆసిఫా బాద్ జిల్లాలో 42 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. వన్య ప్రాణుల సంచారానికి ఆటంకం కలుగకుండా ఈ రహదారిని నిర్మించనున్నారు. గురువారం కౌటాల మండలంలో సర్వే ప్రారంభించారు. డ్రోన్ల సహాయంతో అడవుల్లో సర్వే చేపడుతున్నారు. అలైన్మెంట్ పూర్తిచేసి ఇచ్చే రిపోర్టుతో భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ రహదారిపై వార్ధా నది మీద హైలెవెల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. నాలుగు వరుసలతో నిర్మించనున్న ఈ రహదారిపై వాహనాలు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
ఈ గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ రహదారి..
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గంపలపల్లి, అచ్చులాపూర్, చంద్రపల్లి, రాంరూర్, కత్తెర్ల, ద్వారాకాపూర్, కాసిపేట్, బోపల్లి, మద్నాపూర్, బెల్లంపల్లి మండలం చాకెపల్లి, అంకుశం, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కెపల్లి, కెస్లాపూర్, కొత్తగూడ, వాడల్, లక్ష్మీపూర్, పోతెపల్లి, మంచిర్యాలలోని భీమిని మండలం, ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం రాళ్లగూడ, జెండాగూడ, ఇట్యాల, బోర్లకుంట గ్రామాల మీదుగా అనుకోడ, మాండ్వ, గన్నారం, మోసం, నాగంపేట్, రాస్పెల్లి, కాగజ్నగర్ మండలం జంబుగ, లోనవెల్లి, పరిగావ్, టోంకిని, లక్ష్మీపూర్, వెంట్రావుపేట్, సిర్పూర్(టీ) మండలం రుద్రారం, మీరాపూర్, చింతకుంట, ఆరెపల్లి, కౌటాల మండలం సందగావ్, కోట్టి, కౌటాల, పార్డీ, కుంబరి, వీరవెల్లి తదితర గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.
వన్యప్రాణులకు ఇబ్బందుల్లేకుండా..
జిల్లాలో పెరిగిన దట్టమైన అడవుల కారణంగా పులులతో పాటు వన్యప్రాణుల సంచారం బాగా పెరిగింది. మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి జిల్లాలోకి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవేతో పులులతో పాటు వన్యప్రాణులకూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నారు.