నిర్మల్ టౌన్, మే 22 : దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గంలో దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో భాగ్యరెడ్డివర్మ 135వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, అధికారులతో కలిసి మంత్రి అల్లోల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భాగ్యరెడ్డివర్మ సంఘ సంస్కరణల కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఆంధ్రసభ స్థాపకుడిగా హైదరాబాద్లో దళిత పాఠశాలను ప్రారంభించి, దళిత అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారన్నారు. తమ ప్రభుత్వం కూడా దళితుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఎస్డబ్ల్యూవో రాజేశ్వర్గౌడ్, ఆర్డీవో స్రవంతి, నాయకులు ముడుసు సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్లో..
ఎదులాపురం, మే 22 : ఆదిలాబాద్ కలెక్టరేట్లో భాగ్యరెడ్డివర్మ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి సమాజంలో అసమానతలను తొలగించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని అన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఎన్నో విద్యాసంస్థలు స్థాపంచి అందరూ చదువుకునేలా ప్రోత్సాహించారని పేర్కొన్నారు. విద్యను ఆయుధంగా మలిచి సమాజ అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఎస్డీవో భగత్ సునీతా కుమారి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.