ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎనిమిదో విడుత హరితహారంపై అధికారులతో సమీక్ష
ఎదులాపురం, మే 6 : ఆదిలాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు నర్సరీల్లో కావలసిన మొక్కలు అందుబాటులోఉంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎనిమిదో విడుత ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జూలైలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం 44.74 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ప్రతి మండలంలో మోడల్ నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, మండలాలు, గ్రామాల వారీగా ఉన్న నర్సరీల సంరక్షణకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, డీఎఫ్వో రాజశేఖర్, నీటిపారుదల శాఖ ఈఈ పీ రాము, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేశ్వర్, డీఈవో ప్రణీత, అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రాథోడ్ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.