కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించేందుకు న్యూట్రిషన్ కిట్స్ను ప్రవేశపెట్టారని తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ వంటి గిరిజన ప్రాంతంలో రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో గర్భిణులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ రక్తహీనత నివారణకు ప్రత్యేకంగా న్యూట్రిషన్ కిట్స్ను ప్రారంభించారు. 22 పీహెచ్సీల పరిధిలో 4,014 మందికి కిట్స్ ఇస్తున్నారు.
గతంలో పోలిస్తే ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 85 శాతం పెరిగాయి. పొరుగు రాష్ర్టాల వారు కూడా మన వైద్య సేవలు పొందుతున్నారు. వార్ధాపై త్వరలోనే బ్యారేజీ నిర్మాణం చేపట్టి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రణాళికలు సిద్ధమయ్యే వరకు చెన్నూర్కు మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించకుండా నిలిపివేసినట్లు తెలిపారు. వార్ధా బ్యారేజీతోపాటు చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఒకేసారి టెండర్లు పిలిచేందుకు నిర్ణయించాం. కొంతమంది ప్రతిపక్ష, ఇతర రాజకీయ పార్టీల నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. అనవసర విషయాలపై ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రజలు పట్టించుకోవద్దు. కలెక్టర్ రాహూల్రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో ట్రైబల్, నాన్ట్రైబల్స్కు కిట్స్ అందిస్తామని, ప్రతి పీహెచ్సీలో స్టాక్ అందుబాటులో ఉంచుతామన్నారు.
సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ.. ఈ కిట్స్లో పల్లి పట్టీలు చేరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. కిట్స్ అందరికీ అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని దవాఖానతోపాటు పీహెచ్సీలలో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, డయాలసిస్ సెంటర్లలో ఆపరేటర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని విప్ బాల్క సుమన్ని ఆమె కోరారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. కిట్స్తోనే రక్తహీనతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు నాగేశ్వర్రావు, అజయ్కుమార్, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవెణి మల్లేశ్, సింగిల్ విండో చైర్మన్లు అలిబిన్ హైమద్, పెంటు, వక్ఫ్బోర్డు సభ్యులు ఇంతియాజ్లాలా, డీఎంహెచ్వో ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వోలు సుధాకర్నాయక్, సునీల్రావు, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ స్వామి, ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఎస్పీ శ్రీనివాస్, నాయకులు నిసార్, సాలం, జీవన్, ఎఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు.