నిర్మల్ అర్బన్ : మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపి జిల్లాలో గంజాయి, గుడుంబా, గుట్కా రహిత జిల్లాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో గంజాయిని వినియోగిస్తున్న వారిపై, ఉత్పత్తి, సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరించాలని, విచారణ దర్యాప్తులో ఉన్న కేసులను త్వరగా ఛేదించాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి వినియోగంపై పోలీసు సిబ్బంది నిఘా ఉంచి సంబంధికులపై ఉక్కుపాదం మోపాలని అన్నారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటిమత్తు వ్యసనాలకు బానిసై అనారోగ్య బారిన పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. గ్రామ పోలీస్ అధికారులు తమ గ్రామాలకు కేటాయించిన గ్రామాలు, పట్టణాలలో ఇండ్ల దగ్గర పంట పొలాలలో గంజాయి మొక్కలు దొరికినా సంబంధికులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా సమూలంగా అరికట్టడంలో జిల్లా ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. గంజాయిని అరికట్టడంలో కృషి చేసిన పోలీస్ అధికారులకు ప్రత్యేక రివార్డ్ ను అందజేస్తామని ఆయన వెల్లడించారు. గంజాయి రహిత పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు కంకణ బద్దులమై ఉంటామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, డీఎస్పీ జీవన్ రెడ్డి సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.