నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 8 : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘ఆదర్శ’ విద్యా సంస్థలు ఆంగ్ల బోధనతో అత్యుత్తమ ఫలితాలనిస్తున్నాయి. 2013లో అప్పటి ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 పాఠశాలలు ఏర్పాటు చేశారు. 6 నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల బోధన ద్వారా విద్యాభ్యాసం చేస్తుండగా.. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఐటీ టెక్నాలజీ, బ్యూటీషియన్, స్కిల్ హబ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇంటర్మీడియట్లో 320 మంది చొప్పున చదువుతున్నారు. మొత్తం 14 పాఠశాలల్లో 11,480 మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త మోడల్ స్కూళ్లకు భవనాల నిర్మాణం, ఆంగ్లబోధన, డిజిటల్ విద్యను అమలు చేస్తుండడంతో వీటిలో ప్రవేశాలకు పోటీ కనిపిస్తున్నది.
ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఇంగ్లిష్లో మంచి పట్టు సాధిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు దండేపల్లి మండలం లింగాపూర్, కోటపల్లి, కాసిపేట, మందమర్రిలో, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బజార్హత్నూర్,జైనథ్, బోథ్లో, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూర్, నిర్మల్ జిల్లాలో కుంటాలలో ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతం గ్రామీణ వ్యవసాయ కుటుంబాలకు చెందిన పిల్లలే కావడంతో ప్రతిభ ఆధారంగా ఏటా మోడల్ స్కూల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఏటా ఆరో తరగతిలో వంద మందికి ప్రవేశాలు కల్పిస్తుండగా.. ఇంటర్మీడియట్లో 160 మందిని చేర్చుకుంటున్నారు. దీంతో వారికి ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే వెసులుబాటు కలుగుతున్నది. ఈ విద్యా సంస్థల్లో పూర్తిగా ఆంగ్ల బోధన అమలు చేస్తుండడంతో ఇక్కడి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపుతున్నారు. పదోతరగతిలో 95శాతానికి పైగా మార్కులు సాధిస్తున్నారు. పాలిటెక్నిక్, ఎంసెట్, ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రవేశ పరీక్షల్లో ఏటా 20-25 మంది విద్యార్థులు ఎంపికవుతున్నారు. విద్యా బోధనతో పాటు విషయ పరిజ్ఞానం, పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తుండడంతో ఈ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
కుంటాలలో 2013లో తెలంగాణ ఆదర్శ మోడల్స్కూల్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంగ్లవిద్యకు ప్రాధాన్యమిస్తూ కొత్త భవనాన్ని నిర్మించారు. మా పాఠశాలలో 834 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో స్కిల్ హబ్ పాఠశాలలు ఏడు ఎంపిక చేయగా.. నిర్మల్ జిల్లాలో మా స్కూల్ ఎంపిక కావడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల విద్యను అందిస్తుండడంతో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటున్నది.
-శ్రీనివాస్ ప్రసాద్, ఆదర్శ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్, కుంటాల
నేను ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివా. ఇంటర్మీడియట్లో ఆంగ్లమాధ్యమం ఆదర్శ పాఠశాలలో ఉండడంతో గతేడాది బైపీసీలో చేరాను. ఇక్కడ ఇంగ్లిష్ మీడియంలో బోధనతో పాటు నీట్ పరీక్షలకు తర్ఫీదునిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల ఎటువంటి పోటీ పరీక్షలనైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. ఇంగ్లిష్కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తుండడంతో నాలాంటి పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం దక్కింది.
-కీర్తన, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం