బోథ్, ఫిబ్రవరి 4 : బ్యాంకు నుంచి రుణాలు పొందుతున్న స్వయం సహాయక సంఘం సభ్యులు తిరిగి రుణాలు చెల్లించడంలో ఆసక్తి చూపడం లేదని, బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని సంఘాలకు భవిష్యత్ ఉండదని బోథ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో మొండి బకాయి ఉన్న వాసవి స్వయం సహాయక సంఘంతో శనివారం ఏపీఎం, సీసీ, వీవోఏతో కలిసి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లిస్తే మరింత అదనంగా రుణం మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మొండి బకాయిలను చెల్లించాలని సంఘం సభ్యులను కోరారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మొండి బకాయిలు కడతామని రాజీపడ్డట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఎం మాధవ్, సీసీలు సంజీవ్, లక్ష్మయ్య, ఎం.గంగాధర్, నిరంజన, వాసవి, స్వయం సహాయక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.