నిర్మల్ అర్బన్, నవంబర్ 14 : దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని పింజారిగుట్ట కాలనీలో రూ.50 లక్షలతో నిర్మించిన ఉదాసీమఠం భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 76 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నదన్నారు. పురాతన ఆలయాలను గుర్తించి, పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. కేవలం బుధవార్పేట్ కాలనీలోనే రూ.2.32 కోట్లతో 15 నూతన ఆలయాలను నిర్మించామని వెల్లడించారు. బంగల్పేట్లో నిర్మిస్తున్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి సంక్షేమం తెలంగాణలోనే జరిగిందని చెప్పారు. నిరుపేద ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా 16 వేలు ఆర్థిక సాయం ఇక్కడ తప్ప ఎక్కడా లేదన్నారు. ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవల ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా, బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధరామజీ రాజేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు జగడం యశోద, ఎస్పీ రాజు, గండ్రత్ రమణ, పూదరి రాజేశ్వర్, వేణు, నాయకులు మేడారం ప్రదీప్ డీఎస్పీ జీవన్ రెడ్డి, అప్పాల వంశీ పాల్గొన్నారు.