నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 29 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణుల, బాలింతల పోషకాహార లోప నివారణకు గానూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటలు పెంచాలని సంకల్పించింది. పోషణ్ అభియన్ కార్యక్రమం ద్వారా సేంద్రియ ఎరువులతో కూరగాయల పెంపకానికి శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లాలో పెరటి తోటల పెంపకం సత్ఫలితాలిస్తున్నది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ఈ తోటల పెంపకం తోడ్పాడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో టీచర్లు, ఆయాలు న్యూట్రీషన్ గార్డెన్లు ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు.
ఆలూరులో పెరటితోట ప్రారంభించిన మంత్రి
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన పెరటితోటను ఇటీవల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించారు. పెరటితోటలో క్యాబేజీ, టమాట, మిర్చి, బెండ, గోంగూర, పాలకూర వంటి ఆకుకూరలు పెంచుతున్నారు. ఇప్పటి వరకు పది సార్లు కోతలు నిర్వహించారు. కూరగాయలు పెంచేందుకు జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి, సీడీపీవో నాగమణి, సూపర్వైజర్ విజయగౌరి, ప్రజాప్రతినిధులు తరచూ పెరటితోటను సందర్శించి సిబ్బందికి అవగాహన కల్పిస్తూ సూచనలు చేస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలను పలు అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉచితంగా సరఫరా చేస్తున్నారు.
పోషకాహార లోపం నివారణకు పెరటి తోటలు
గర్భిణుల, చిన్నారుల పోషకాహార లోపం నివారణకు గాను జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెరటితోటల పెంచాలని సిబ్బందికి సూచించాం. కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో న్యూట్రీషన్ గార్డెన్లు ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. పెరటితోటలో పెరిగిన కూరగాయలతోనే వంటలు చేస్తున్నారు.ఈ పెంపకాన్ని సీడీపీవోలు, సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. పెరటితోటల పెంపకం సత్ఫలితాలనిస్తున్నది. -కే విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి, నిర్మల్