నిర్మల్ అర్బన్, అక్టోబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగవారం పట్టణంలోని శాంతినగర్ కేజీబీవీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ వివక్షతను రూపు మాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మండలంలో కేజీబీవీలను స్థాపించి, మగ పిల్లలతో సమానంగా కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తున్నదన్నారు. సమాజంలో బాల్యవివాహాలను రూపు మాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఆడపిల్లలు సమాజానికి మణిహారమన్నారు. అనంతరం డీఆర్డీవో విజయలక్ష్మి మాట్లాడూతూ.. ఆడపిల్లలు వివక్షతకు దూరంగా ఉండి మగ పిల్లలతో సమానంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఈవో రవీందర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి శ్రీదేవి, ఎస్వోలు సుజాత, లతా దేవి, బాలల సంక్షేమ సమితి అధ్యక్షులు వహీద్, సభ్యులు శ్రీలత, స్వదేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి మురళి, సఖీ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు.