నిర్మల్ అర్బన్, ఆగస్టు 27 : కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు పోలీస్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 10,014మంది దరఖాస్తు చేయగా 28పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. 28 చీఫ్ సూపరింటెండెంట్లు, 31మంది పరిశీలకులు, 417మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు సహా అన్ని మౌలిక వసతులు కల్పించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, బయోమెట్రిక్ నమోదు దృష్ట్యా అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు సైతం పలు రూట్లలో ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నారు. ఈ మేరకు ఎస్పీ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులు, పరిశీలకులు, చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు.