కడెం, జూలై 3: ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగడంతో పాటు ఉపాధ్యాయులు కృషి ఫలితం, విద్యార్థుల శ్రమతో అత్యున్నత ఫలితాలు సాధిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి. కడెంతో పాటు, అంబారిపేట, కేజీబీవీ, నచ్చన్ఎల్లాపూర్ గురుకులం, జీయర్ గురుకులం, పాతమద్దిపడగ, లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 398 మంది విద్యార్థులకు గాను 391 మంది ఉత్తీర్ణులు కాగా, కేవలం ఏడుగురు విద్యార్థులు మాత్రమే స్వల్ప మార్కులతో ఫెయిలయ్యారు. కాగా, ఈ పాఠశాలల్లో నచ్చన్ఎల్లాపూర్ గురుకులం, జీయర్ గురుకులం, కేజీబీవీ, అంబారిపేట జడ్పీ పాఠశాలల్లోని విద్యార్ధులు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. కడెం, లింగాపూర్, పాతమద్దిపడగ పాఠశాలలు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కరోనా అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఈ ఏడాది పాఠశాలల నిర్వహిస్తుండడంతో అటు ఉపాధ్యాయులు, జిల్లాస్థాయి అధికారులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అనుకున్న స్థాయిలో ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాను ద్వితీయ స్థానంలో నిలుపడంతో ఉత్తబ ఫలితాలు సాధించిన ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులను మంత్రి, కలెక్టర్ సత్కరించారు. కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీనిత, ప్రవీణ, నాగేశ్వరి, వసుమతి, మిత్రవింద 10 జీపీఏ, కేజీబీవీ విద్యార్థిని సింధు ఈ పాఠశాల నుంచి 10 జీపీఏ సాధించడంతో గురుకుల విద్యపై మరింత విశ్వాసం పెరిగింది. నిత్యం విద్యార్థులతో ఉంటూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు సైతం ప్రోత్సహిస్తున్నారు.
ఉపాధ్యాయుల చొరవతో 10 జీపీఏ
కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయులు అనుకున్న లక్ష్యంవైపు మమ్మల్ని ప్రోత్సహించారు. 10 జీపీఏ సాధించేలా మాలో ఉత్సాహాన్ని నింపుతూ మా కోసం నిత్యం శ్రమించారు. మా పాఠశాల నుంచి 10 జీపీఏ సాధించడంతో ఉపాధ్యాయులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధిస్తూ మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఎంతో కలిగింది.
ఎన్ సింధు, కేజీబీవీ, కడెం
సమష్టి కృషితోనే సత్ఫలితాలు
పాఠశాల ప్రారంభం నుంచి మా ఉపాధ్యాయులకు ఒక్కటే సూచన చేశాం. గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని సూచన చేశాం. కానీ వారు అప్పుడే బదులిచ్చారు. గతంలో కన్నా మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని చెప్పారు. వారు చెప్పిన మాటలనే తిరిగి విద్యార్థులకు చెప్పా. అయితే విద్యార్థులు సైతం మా నమ్మకాన్ని నిలబెట్టేలా ఫలితాలు సాధిస్తామని హామీ ఇచ్చి వందశాతం ఫలితాలు సాధించారు.
సత్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్, నచ్చన్ఎల్లాపూర్ గురుకుల పాఠశాల, కడెం