నిర్మల్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 67 కస్తూర్బా పాఠశాలలున్నాయి. ఒక్కో తరగతికి 40 మందికి మాత్రమే ప్రవేశాలు ఉండగా.. అడ్మిషన్లకు పోటీ ఎక్కువగా ఉంటుండడంతో అంతకు ఎక్కువ సంఖ్యలోనే చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తుండగా..స్కూళ్లు ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈనెల 30 వరకు చేరికలకు అవకాశం ఉన్ననప్పటికీ ఖాళీల కంటే ఎక్కువ మంది ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థులను తీసుకోవాల్సి ఉండగా..సీట్లకు ఉన్న డిమాండ్ కారణంగా ప్రస్తుతం 250 వరకు ప్రవేశాలను తీసుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలోని అన్ని కస్తూర్బా పాఠశాలలు విద్యార్థినులతో కిటకిటలాడుతున్నాయి.
ఆంగ్లమాధ్యమంపై ఆసక్తి..
ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో నిర్మల్ రూరల్, దస్తురాబాద్, సోన్, నర్సాపూర్ కస్తూర్బా పాఠశాలల్లోనే ఇప్పటివరకు ఆంగ్లమాధ్యమంతో బోధన జరుగుతోంది. అయితే ఈ ఏడాది నుంచి అన్ని కస్తూర్బా పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో తల్లిదండ్రుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక్కడి పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన కొనసాగుతున్నది. యేటా ఈ పాఠశాలల బాలికలు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. చదువుతోపాటుగా బాలికలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అల్లికలు వంటి వాటిల్లో నైపుణ్యతను పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. యోగా, క్రీడల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన భోజనంతోపాటు సొంత భవనాలు, మెరుగైన వసతి సౌకర్యం ఉండడంతో ఎక్కువమంది కస్తూర్బాల్లోనే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నో అడ్మిషన్స్ బోర్డుల ఏర్పాటు..
గతానికి భిన్నంగా కస్తూర్బాల్లో విద్యార్థినుల చేరికలు రోజురోజుకూ అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథలు, బాలకార్మికులు, వలస కూలీల కుటుంబాల పిల్లలు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చి ప్రవేశాలు కల్పిస్తున్నారు. 6వ తరగతిలో ఒక్కసారి ప్రవేశం పొందితే ఇంటర్ వరకు చదువుకు ఢోకా లేదన్న భావన కూడా అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే కస్తూర్బాల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే నర్సాపూర్, దిలావర్పూర్, సోన్, దస్తురాబాద్, కల్లూరు, నిర్మల్ అర్బన్, లక్ష్మణచాంద కస్తూర్బాల్లో అడ్మిషన్స్ క్లోజ్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
స్కూల్ బాగుందని చేరా..
ప్రైవేటు స్కూల్లో చదివే ఆర్థిక స్థోమత లేదు. ఎవరిని అడిగినా కస్తూర్బా స్కూల్ గురించి బాగా చెబుతున్నరు.. అందుకే 6వ తరగతిలో కొత్తగా అడ్మిషన్ తీసుకున్న. ఇక్కడికి వచ్చి చూశాక వసతులన్నీ బాగున్నయ్. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం కూడా ఉంది. నాలాంటి పేదింటి బిడ్డలకు ఈ స్కూల్ ఎంతో వరం. – షేక్ ఆప్సీన్, శాంతి నగర్, నిర్మల్
ఆంగ్లమాధ్యమం అమలు సంతోషంగా ఉంది..
ఆరో తరగతిలో ఇక్కడ చేరిన. నిన్నమొన్నటి వరకు తెలుగు మీడియంలోనే చదువులు సాగాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో క్లాసులుంటయని టీచర్లు చెబుతున్నరు. ఇంగ్లీష్ మీడియం లేదని ఇన్నాళ్లుగా ఒకింత బాధ ఉండేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
– నాలం రజిత, 8వ తరగతి, ఓలా గ్రామం, కుంటాల మండలం
ప్రైవేటులో ఫీజులెక్కువ..
నాకు ఇద్దరు పిల్లలు. బిడ్డను ఏడో తరగతి వరకు ప్రైవేటు స్కూల్లో చదివించిన. యేటా ఫీజులు, ఇతర ఖర్చులు యాభై వేల వరకు అయ్యేది. ఇక ప్రైవేటులో చదివించడం కష్టమైంది. ఇంగ్లిష్ కోసమే ప్రైవేటులో చేర్పించిన. గిప్పుడు కస్తూర్బా పాఠశాలలో కూడా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తమని చెబుతున్నరు. నాకెంతో సంతోషంగా ఉంది. ఇక నాబిడ్డ కూడా ఇంగ్లిష్ చదువులు చదువతది.
– శివ కుమార్, వడ్తాల్, ముథోల్ మండలం
విద్యార్థినులపై నిరంతర పర్యవేక్షణ
విద్యార్థినులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. అలాగే బోధనా సిబ్బంది, ఇతర సిబ్బంది పనితీరును పైస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. విద్యార్థినులు సాధించే మార్కులు, ఉత్తీర్ణత తదితర వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష ఉంటుంది. చదువులో వెనుకబడ్డ వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నాం.
– సుజాత, ఎస్వో, నిర్మల్ అర్బన్ కస్తూర్బా పాఠశాల
ఆడపిల్లలకు పూర్తి భరోసా
కస్తూర్బా పాఠశాలల్లో అమ్మాయిలకు పూర్తి భరోసా కల్పించేదిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ నమ్మకంతోనే తల్లిదండ్రులు వారి పిల్లలను నిస్సంకోచంగా పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఈసారి ఇంగ్లిష్ మీడియంను అమలు చేస్తుండడంతో మరింత క్రేజీ పెరిగింది. చదువుతోపాటు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా చేతివృత్తుల శిక్షణ కూడా ఇస్తున్నాం. ప్రతియేడు మాదిరిగానే ఈసారి కూడా ఖాళీల కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.
– శ్రీదేవి, విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్, నిర్మల్ జిల్లా