భైంసా, జూలై 3 : అంగన్వాడీ కేంద్రాల్లో సృజనాత్మక విధానాలు అవలంబిస్తున్నారు. దీంతో ఇవి చిన్నారులకు విజ్ఞాన కేంద్రాలుగా మారుతున్నాయి. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పాటు వారి మేధస్సుకు పదును పెట్టేలా ఆట, పాటలతో బోధిస్తున్నారు. భైంసా డివిజన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు ప్రభుత్వం మెనూ ప్రకారం పౌష్టికాహారంతో పాటు గుడ్లు అందిస్తున్నారు. దీనికితోడు కేంద్రానికి వచ్చిన చిన్నారులకు టీచర్లు డ్యాన్స్, ఆటలు నేర్పిస్తున్నారు. బొమ్మలు చూపిస్తూ అక్షరమాల, వివిధ ఆహార పదార్థాలు, దేశభక్తితో కూడిన నీతి కథలు బోధిస్తున్నారు. చిట్టి మేధస్సుకు పదును పెడుతున్నారు.
ఆకట్టుకునేలా కథలు..
అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నో రకాల కథల పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. చిన్నారులను ఒకే చోట కూర్చోబెట్టి వారికి కథలు, పద్యాలు చెబుతున్నారు. ప్రతినెలా పిల్లల బరువు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఏ వయస్సుకు ఎంత బరువు ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. బాలామృతంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నారులకు ఆడుకునేందుకు ఆట వస్తువులతో పాటు అక్షరమాల, జంతువులు, అంకెలు గీసి నేర్పిస్తున్నారు. వారికి ఎలా చెబితే అర్థమవుతుందో తెలుసుకొని బోధిస్తున్నారు.
నాణ్యమైన బోధన అందిస్తున్నాం..
ప్రతి చిన్నారికీ క్రమశిక్షణతో పాటు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నాం. ఇంటిని మరిచిపోయేలా అంగన్వాడీ బడిని తీర్చిదిద్దుతున్నాం. కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెరిగింది. వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇస్తున్నాం. దీంతో వారిలో ఆలోచన శక్తి పెరుగుతున్నది.
– జయశ్రీ, అంగన్వాడీ టీచర్
చిన్నారుల సంక్షేమమే లక్ష్యం..
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ఉన్నది. కేంద్రాలను బలోపేతం చేసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. చిన్నారుల సంక్షేమమే మా లక్ష్యం. ఆటపాటలతో పాటు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. కేంద్రాల్లో వైవిధ్యమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందిస్తున్నాం.
– నాగలక్ష్మి, సీడీపీవో