నిర్మల్ అర్బన్, జూన్ 26:తెలంగాణ సర్కారు పాఠ్యపుస్తకాలను దశలవారీగా జిల్లాలకు సరఫరా చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా చేరవేస్తున్నది. యూడైస్లోని విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ముద్రించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17,37,739 పుస్తకాలు అవసరం ఉండగా.. ఇప్పటికీ 9,11,000లు జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ ఉన్నాయి. ఇంకా.. 8,62,739 రావాల్సి ఉంది. వీటిని కూడా త్వరలో పంపిణీ చేయనున్నది. మొదటగా ఆయా మండల విద్యాధికారులకు అందనుండగా.. తర్వాత పాఠశాలలకు రానున్నాయి.
– ఒకే పుస్తకం.. రెండు భాషల్లో ముద్రణ..
ఈ యేడాది నుంచి సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చదువులవైపు దృష్టి పెట్టారు. చదువుల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం ఈ యేడాది పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ మీడియం(ఒకే పుస్తకం)లో ముద్రించింది. దీంతో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువుల్లో ఇబ్బందులను దూరం చేసేందుకు చర్యలు తీసుకోగా.. ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాల ముద్రణ నిర్ణయంపై విద్యార్థులు,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బార్ కోడింగ్ ఆధారంగా పంపిణీ
కోట్లాది రూపాయల ఖర్చుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. స్కాన్, బార్ కోడింగ్ ఆధారంగా పాఠ్యపుస్తకాలను ముద్రించింది. పుస్తకాలపై ఉన్న బార్ కోడ్ ద్వారా అవి ఏ జిల్లాకు కేటాయించడం జరిగిందో సులువుగా తెలుసుకోవచ్చు. ప్రైవేటు వ్యక్తులు విక్రయించకుండా బార్ కోడ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పక్కదారికి అడ్డుకుట్ట పడనున్నది.
నేటి నుంచి పాఠ్యపుస్తకాల తరలింపు
నిర్మల్ జిల్లాలోని 834 ప్రభుత్వ పాఠశాలలకు నేటి (సోమవారం) నుంచి పాఠ్య పుస్తకాలను సరఫ రా చేయనున్నాం. నిర్మల్ జిల్లాకు ఇప్పటి వరకు 62 శాతం పుస్తకాలు వచ్చాయి. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా పుస్తకాలు రానున్నాయి. ఉర్దూ మీడియం విద్యార్థుల పుస్తకాలకు వారం రోజుల సమయం పడుతుంది. నేడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు 13 డీసీఎం వాహనాల ద్వారా సరఫరా చేయనున్నాం. మంగళవారం పాఠశాలలకు ఆయా ప్రదానోపాధ్యాయులు తీసుకెళ్లి బుధవారం విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించాం.
– రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్.