నిర్మల్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో చేపట్టిన సంస్కరణలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని నేరాలను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నా యి. కేసుల ఛేదనలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాధారణ నేరాలతోపాటు సై బర్ నేరాల అదుపునకు సాంకేతికతను ఉపయోగించుకుంటూ మిగతా జిల్లాల కన్నా ముందు వరుస లో ఉంటున్నారు. ముఖ్యంగా సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం) ద్వారా పోలీసుల పనితీరు మెరుగైంది. 2020లో జిల్లావ్యాప్తంగా 2,521 కేసులు నమోదు కాగా, 2021లో 2,703 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది కేవ లం ఏడు శాతం మాత్రమే కేసులు పెరగడం పోలీసుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కేసులు నమోదైన వెంటనే దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకుంటున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైం కేసులపై సీరియస్గా దృష్టి పెట్టారు.
సోషల్ పోలీసింగ్ పేరిట జనానికి చేరువ
సోషల్ పోలీసింగ్ పేరిట జనానికి చేరువవుతు న్న పోలీసులు.. సైబర్ నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర కేసుల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. అ లాగే శివారు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్, అనుమానాస్పద వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్, అసాంఘిక కార్యకలాపాలపై విద్యార్థులకు, యువకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. సోషల్ పోలీసింగ్లో భాగంగా 2,117 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ గా.. దొంగతనాల కేసుల ఛేదన సులభతరమవుతున్నది. 2020లో జిల్లా వ్యాప్తంగా 144 దొంగతనా ల కేసులు నమోదు కాగా, 2021లో 169 నమోదైనప్పటికీ.. కొన్నేండ్ల దొంగతనాల కేసుల సగటుతో పోలిస్తే కొంతమేర తగ్గినట్లేనని పోలీసులు చెబుతున్నారు. కాగా, 2020లో సైబర్ నేరాలకు సంబంధించి తొమ్మిది కేసులు నమోదు కాగా, 2021లో 16 కేసులు నమోదయ్యాయి.
టెక్ టీం ఏర్పాటు
సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు జిల్లా టెక్ టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంలో సాంకేతికతపై పట్టున్న ఒక సీఐ, ఎస్ఐతోపాటు పోలీసు సిబ్బంది ఉంటారు. ఈ టీం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడమే కాకుండా, నేరాల ఛేదనలో తోడ్పాటును అందిస్తున్నది. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చి భారాన్ని తగ్గిస్తున్నది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ టెక్ టీం సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నది.
సైబర్ క్రైం నిరోధానికి టోల్ ఫ్రీ
సైబర్ నేరాల అదుపుతోపాటు ప్రజలకు అవగాహన పెంపొందించాలన్న లక్ష్యంతో పోలీసు శాఖ టోల్ఫ్రీ నంబర్ 1930ని ఏర్పాటు చేసింది. ఈ నంబర్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరపత్రా లు, పోస్టర్లతోపాటు సోషల్ మీడియా ద్వారా ప్ర చారం నిర్వహిస్తున్నది. ఫేక్ ఫోన్ కాల్స్తో ఏటీ ఎం నంబర్ వివరాలను తెలుసుకునే వారిపై అ ప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నది. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్లో అధిక వడ్డీలకు పెట్టుబడుల పేరిట జరిగే మోసాలపై బాధితులు టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయగానే.. సిగ్నల్ ట్రాకింగ్తో నేరస్తుడి సమాచారాన్ని తెలుసుకోనున్నది. అలాగే టోల్ ఫ్రీ ఫిర్యాదు దారుడిని మోసం నుంచి రక్షించేందుకు ఆయనకు సంబంధించిన అన్నిరకాల లావాదేవీలను తాత్కాలికంగా స్తంభింపజేసి, నిం దితులను గుర్తించనున్నది.
సాంకేతికత సహకారంతో నేరాల అదుపు
పోలీసుశాఖలో సీసీటీఎన్ఎస్ విధానం అమలవుతుండడంతో కేసుల ఛేదనలో ఇబ్బందులు తగ్గాయి. సాంకేతిక సహకారంతో అన్ని పోలీస్స్టేషన్ల మధ్య అనుసంధానం ఏర్పడింది. జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ సిస్టం, 24 గంటలు పనిచేసే పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటుతో సమన్వయం మెరుగైంది. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల అదుపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ప్రజలు మోసపోకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం.
– జీవన్రెడ్డి, డీఎస్పీ, నిర్మల్