నిర్మల్ టౌన్, జూన్ 19:తెలంగాణ ఆర్టీసీకి ప్రజల్లో ఆదరణ తెచ్చేందుకు రాష్ట్ర సర్కారు, ఎండీ సజ్జనార్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పేరిట వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూర్చగా, తాజాగా ఫాదర్స్డేను పురస్కరించుకొని ఐదేళ్లలోపు పిల్లలున్న తండ్రులకు ఉచిత ప్రయాణానికి అనుమతినిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 620 బస్సు సర్వీసులుం డగా, ఆదివారం నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూరు, మంచిర్యాల డిపోల పరిధిలో ఐదేళ్లలోపు పిల్లలున్న తండ్రులకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు ఐదు వేల మంది ఉచిత ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఐదేళ్లలోపు పిల్లలతో తల్లిదండ్రులు సుదూర ప్రయాణ షెడ్యూల్ను ఏర్పాటు చేసుకోవడంతో ఆర్టీసీకి మంచి ఆదరణ పెరగడమే కాకుండా తండ్రులకు అరుదైన గౌరవం దక్కింది.
ఆర్టీసీని ఆదరించాలి..
ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే నినాదంతో అనేక రాయితీ పథకాలు కల్పిస్తున్నాం. పండుగ సందర్భాల్లో ప్రత్యేక ఉచిత ప్రయాణాలు అమలు చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫాదర్స్డేను పురస్కరించుకొని ఉచిత ప్రయాణం చేసేందుకు తండ్రులు ఉత్సాహం చూపారు. ఒక్కరోజే ఐదు వేల మందికి పైగానే ఉచిత ప్రయాణం చేశారు. ఫాదర్స్డే సందర్భంగా తండ్రులకు గౌరవం ఇవ్వడంతో అందరూ అభినందించారు.
-సాయన్న, డిపో మేనేజర్, నిర్మల్
రూ. 120 చార్జి మిగిలింది…
మాది మామడ మండలంలోని ఆరెపల్లి గిరిజన తండా. మా గ్రామం నుంచి నిర్మల్ రావడానికి రూ. 60చార్జి ఉంది. ఫాదర్స్డే సందర్భంగా ఉచిత ప్రయాణం కావడంతో బస్సుల్లో ఎక్కగానే కండక్టర్ మా బాబు ఐదేళ్ల లోపు ఉండడంతో టిక్కెట్టు కొట్ట లేదు. రానూపోను రూ.120 వరకు చార్జి మిగిలింది. ఆర్టీసీకి కృతజ్ఞతలు. ఫాదర్స్డే రోజు ఇలాంటి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది.
-ప్రవీణ్ జాదవ్, ఆరెపల్లి, మామడ మండలం
వచ్చేప్పుడు చార్జి… పోయేప్పుడు ఫ్రీ..
నాది ఉట్నూరు. నా భార్య నిర్మల్లోని ఓ దవా ఖానలో వారం క్రితం డెలివరీ అయ్యింది. ఆదివారం డిశార్చి చేయనుండడంతో శనివారం రాత్రి అక్కడి నుంచి నిర్మల్ రావడానికి రూ.150 ఛార్జి అయింది. ఆదివారం మా బాబును ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా.. కండక్టర్ నాకు టికెట్ తీసుకోలేదు. రూ.150 చార్జి మిగిలింది. తండ్రులను గౌరవిస్తూ ఆర్టీసీ ఫాదర్స్డే అని ఇసొంటి ఫ్రీ జర్నీ పెట్టుడు మంచిగున్నది.
-భీంరావు, ఉట్నూరు
ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తున్న..
మేం నిర్మల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్నం. మాకు ఆది, సాక్షి అని ఐదేళ్లలోపు పిల్లలున్నరు. బస్సు ఎక్కగానే కండక్టర్ మా భార్యకు టిక్కెట్టు తీసుకొని నాకు టికెట్ అవసరం లేదన్నడు. ఇదేమని అడిగితే ఫాదర్స్డే అని చెప్పిండు. తండ్రులకు టిక్కెట్టు తీసుకోవడం లేదని అన్నడు. బస్సు ఎక్కగానే టికెట్ అనే కండక్టర్, ఫ్రీ ప్రయాణం అనగానే సంతోషమనిపించింది. ముందుగా ఆశ్చర్యమేసింది. ఆర్టీసీలో మంచి నిర్ణయాలు తీసుకోవడంపై నా భార్య కూడా సంబుర పడ్డది.
-సంతోష్, నిర్మల్
అత్తగారింటికి పోతున్న..
మాది సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామం. నాకు మూడేళ్ల పాప ఉంది. ఇయ్యాల అత్తగారింటికి పోతున్న. బస్సులో ఎక్కగానే కండక్టర్ తండ్రుల దినోత్సవం అంటూ టికెట్ లేదని చెప్పడంతో ఆశ్చర్యమేసింది. కౌట్ల నుంచి నిర్మల్, ఇక్కడి నుంచి లోకేశ్వరం వెళ్లేందుకు రూ.100 చార్జి మిగిలింది. ఆర్టీసీ ద్వారా మంచి అవకాశాన్ని కల్పించినందుకు సంతోషంగా ఉంది.
-నవీన్, కౌట్ల(బి), సారంగాపూర్ మండలం
చిన్న పిల్లలు కన్పిస్తే బస్సు ఆపాం..
మాది భైంసా డిపో. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్మల్ – భైంసాకు ఐదు ట్రిప్పులు నడుపుతున్న. రోడ్డుపై చిన్నపిల్లలతో తల్లిదండ్రులు కనిపిస్తే బస్సు ఆపి ఎక్కించుకున్న. బస్సు ఎక్కగానే వారికి టిక్కెట్టు లేదని చెప్పడంతో చాలా సంబురపడ్డరు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ఏ ఆదేశాలు జారీ చేసినా దాన్ని పాటించడం మా బాధ్యత. దీంతో మాకు కూడా మంచి పేరు వస్తది.
-అబ్దుల్ జబ్బార్, ఆర్టీసీ డ్రైవర్, భైంసా
ఎంతో సంబురపడ్డరు..
నేను 20 ఏళ్ల సంది కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న. ప్రయాణికుల సంఖ్య పెరిగితేనే మా సంస్థకు మేలు జరుగుతది. ఇటీవల కొంత మార్పులు వస్తున్నయ్. పలు దినోత్సవాల సందర్భంగా ఆయా వర్గాలకు ఫ్రీ ప్రయాణం కల్పిస్తుండడం బాగుంది. బస్సు ఎక్కాక టికెట్ ఫ్రీ అంటే వాళ్లు ఎంతో సంబురపడుతున్నరు. ఈ సరికొత్త పథకాలతో సంస్థకు ఆదరణ పెరుగుతున్నది.
-స్వర్ణలత, కండక్టర్, నిర్మల్