బోథ్, జూన్ 19: రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో పత్తికి అధిక డిమాండ్ ఉండడంతో ఈ పంట వేస్తున్నారు. బోథ్ మండలంలో 2021-22కి గాను వానకాలం పంట కింద 45,324 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. అత్యధికంగా 29,597 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గత ఏడాది పత్తిలో ఆశించిన దిగుబడి రాకున్నా మార్కెట్లో క్వింటాలుకు రూ.9 వేల నుంచి రూ .10 వేల వరకు (సరాసరి) ధర పలకడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పత్తి నిల్వలు లేక ఈ యేడు ధర ఆశించిన స్థాయిలోనే పలుకుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పత్తి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సుమారు 32 వేలకు పైగా ఎకరాల్లో ఈ పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలోని విత్తనాల దుకాణాల నుంచి రైతులు ఇప్పటి వరకు 45 వేల వరకు పత్తి విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మరికొంత మంది ఆదిలాబాద్, ఇచ్చోడ, నిర్మల్, కిన్వట్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకు వచ్చారు. ప్రస్తుతం వాతావరణం విత్తనాలు వేయడానికి అనువుగా ఉండడంతో చాలా గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపుగా 85 శాతం వరకు రైతులు విత్తనాలు వేసే పనులు పూర్తి చేశారు. మిగిలిన రైతులు పత్తి విత్తనాలు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. మొత్తం మీద పత్తికి రానున్న మార్కెట్ సీజన్లో అత్యధిక ధర పలుకుతుందనే నమ్మకంతో అన్నదాతలు ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తున్నారు.
పత్తి సాగు పెరిగే అవకాశం ఉంది…
వానకాలం సీజన్లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. గత ఏడాది కంటే పది శాతం అదనంగా పత్తిని రైతులు సాగు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పత్తికి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. విత్తనాలు వేసే సమయం ఇంకా మిగిలి ఉన్నా అంచనా ప్రకారం 32 వేల ఎకరాల వరకు పత్తి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెండి విశ్వామిత్ర, బోథ్ వ్యవసాయాధికారి