నిర్మల్, జూన్ 13(నమస్తే తెలంగాణ) : నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దాదాపు ముగిసింది. నిర్మల్ జిల్లాలోని 18 మండలాల పరిధిలోని 182 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడ్ రకానికి రూ. 1960, కామన్ గ్రేడ్ రకానికి రూ.1940 చొప్పున మద్దతు ధర కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న వడ్ల కొనుగోళ్లను ప్రారంభించగా, ఈ నెల 10వ తేదీతో ముగిసింది. 40 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, 1.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఏ-గ్రేడ్ రకం లక్షా 11 వేల 500 మెట్రిక్ టన్నులు, సాధారణ రకం 8500 మెట్రిక్ టన్నులు మొత్తం కలిపి లక్షా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 28,382 మంది అన్నదాతల నుంచి రూ.235 కోట్ల విలువ చేసే వడ్లు కొన్నారు. ఇందులో 4,605 మంది రైతులకు 21,200 మెట్రిక్ టన్నుల ధాన్యానికి (ఏ-బీ గ్రేడ్లు కలుపుకొని) సంబంధించి రూ.41 కోట్లకు పైగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన వారికి వచ్చే వారంలో డబ్బులు జమ చేయనున్నారు. జిల్లాను 3 సెక్టార్లుగా విభజించి, ఏ రోజు కొన్న ధాన్యాన్ని ఆ రోజే కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించారు. జిల్లాలో ఉన్న మిల్లుల్లో స్థలం సరిపోక పోవడంతో ధాన్యాన్ని సమీపంలోని ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో గల మిల్లులకు అధికారులు తరలించారు. రైతులు ధాన్యం అమ్మిన తర్వాత వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు చేశారు.
మంచిర్యాల జిల్లాలో..
జిల్లాలో యాసంగిలో 73,632 ఎకరాల్లో వరి సాగు చేయగా, 1.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,08,835.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఇందులో ఏ-గ్రేడ్ 2,078.720 మెట్రిక్ టన్నులు, సాధారణ రకానికి చెందిన 1,06,757.200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 15,018 మంది రైతుల వద్ద రూ.213.32 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ. 43.73 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా డబ్బులు కొద్ది రోజుల్లో జమ చేయనున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో యాసంగిలో 7,745 ఎకరాల్లో వరి సాగు చేయగా, 17,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 26 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 14,300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. మొత్తం 1694 మంది రైతుల వద్ద రూ.28 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ. 3.43 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా డబ్బులు కొద్ది రోజుల్లో జమ చేయనున్నారు.
కేంద్రం సహకరించకున్నా..
ఉమ్మడి జిల్లాలో సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాసంగిలో ధాన్యం దిగుబడి పుష్కలంగా వచ్చింది. కేంద్రం కొర్రీలు పెట్టినప్పటికీ రైతులను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగింది. ప్రతి గింజను కొంటామని సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించగా, అందుకు తగ్గట్లుగానే చర్యలు చేపట్టారు. కొనుగోళ్లు, మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతోపాటు సరిపడా గన్నీ బ్యాగులను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. ఫలితంగా అనుకున్న గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయగలిగారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లోనూ మద్దతు ధర కల్పించి జిల్లా రైతాంగానికి అండగా నిలవడంపై రైతు కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.