నిర్మల్ అర్బన్, జూన్ 14 : మహిళలు, విద్యార్థినుల రక్షణ, భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా షీ టీం బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో ఇకపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. జిల్లాలో 2016 సంవత్సరంలో అప్పటి జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ షీ టీమ్ సేవలను ప్రారంభించగా వేధింపులకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదయ్యాయి. నిత్యం మఫ్టీలో ఉంటూ ఆకతాయిల ఆగడాలను గమనిస్తూ కేసులను నమోదు చేస్తున్నారు.
అమ్మాయిలను వేధిస్తే కటకటాలే..
విద్యార్థినులు, యువతులు, మహిళలను వేధిస్తే కఠిన శిక్షలు అనుభవించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో షీటీం బృందాలు నిఘా అప్రమత్తమయ్యాయి. మొదటి సారి పట్టుబడితే వేధించిన వ్యక్తితో పాటు అతడి కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయనప్పటికీ మార్పు రాకపోతే కఠిన శిక్షతో పాటు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు.
జిల్లాలో షీటీం సేవలు…
అమ్మాయిలను, మహిళలను వేధించే ఆకతాయిల భరతం పట్టేందుకు జిల్లాలో 3 షీ టీం బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంతో పాటు, బైంసా, ఖానాపూర్తో పాటు ఇతర మండల కేంద్రాల్లో షీ టీం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరు నిత్యం మఫ్టీలో విధులను నిర్వహిస్తున్నారు.
షీ టీమ్ సేవలపై విస్తృత అవగాహన…
ఈవ్టీజింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో షీ టీం బృందాలు నిఘా పెంచనున్నాయి. బస్టాండ్లు, సినిమా హాళ్లు, కూడళ్లు, బస్టాప్లు, కళాశాలలు, పాఠశాలలు, పార్కులు తదితర ప్రాంతాల్లో వేధింపులు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో షీ టీం బృందాలు పర్యవేక్షించనున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికే అనేక అవగాహన సదస్సులను నిర్వహించి విద్యార్థులను అప్రమత్తం చేశారు. పాఠశాలలు , కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ర్యాగింగ్, ఈవ్టీజింగ్ జరుగకుండా పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. విద్యార్థులను చైతన్యం చేయడం, దాడులను ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఆత్మరక్షణ చర్యలు, ప్రతిదాడులపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
వివరాలు గోప్యంగా ఉంచుతాం..
మహిళలను, విద్యార్థులను ఎవరైనా వేధించినా, వారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100 లేదా షీ టీం వ్యక్తిగత నంబర్ 9490619043కు సమాచారం అందించాలి. ఫిర్యాదు చేసిన మహిళలు, విద్యార్థులు, యువతుల వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఫోన్లో ఫిర్యాదులను స్వీకరిస్తాం. బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండానే ఆకతాయిలకు కుటుంబ సభ్యుల మధ్య కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. అయినా వేధింపులకు పాల్పడితే కఠిన శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తాం.
– సుమన్, షీ టీం ఎస్ఐ
తొలిసారి కౌన్సెలింగ్…
గతంలో సోన్ మండలానికి చెందిన యువకుడు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె షీ టీం పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు వెంటనే (మహిళ తరఫు వ్యక్తులు, ఫిర్యాదుదారులు ఎవ్వరూ లేకుండా) యువకుడి వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు.
పట్టణానికి చెందిన యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
వీరితో పాటు ఇప్పటి వరకు జిల్లాలో 52 మంది యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. 15 రోజుల పాటు పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాలని, పద్ధతి మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.