నిర్మల్ టౌన్, మే 31: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పంటల దిగుబడుల్లో రికార్డు సృష్టించిందని, రానున్న రోజుల్లో ఆయిల్పామ్ సాగును 30శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉద్యానవనశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఉద్యానవనశాఖ కార్యాలయంలో ఆయిల్పామ్ సాగుపై ఉమ్మడి జిల్లా అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంలో కొత్త విప్లవం ప్రారంభమైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. వ్యవసాయంలో మైక్రో లెవల్ ప్లానింగ్ అమలు చేస్తూ బిందు, తుంపర్ల సేద్యంతో పాటు ఆయిల్పామ్ సీడ్ను ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 30లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 1.60కోట్ల ఎకరాల్లో పంట భూమి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 7నుంచి 21వరకు ఆయిల్పామ్ సాగును పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో వెయ్యి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయిల్కు మంచి డిమాండ్ పలుకుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆయిల్ను సిద్ధంగా ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఉద్యానవనశాఖ జిల్లా అధికారి శ్యాంరావు రాథోడ్, అధికారులు ఫాతిమా, ఆయిల్పామ్ అధికారి రామ్మోహన్ తదితరులున్నారు.