సోన్, మే 31: వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటూనే నకిలీ విత్తనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ మండలం అక్కాపూర్ రైతువేదికలో మంగళవారం ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో వానకాలం సాగుకు అవసరమయ్యే విత్తనాలను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచిందని పేర్కొన్నారు. రైతులకు సాగు విధానంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. సీడ్ షాపులను ప్రతిరోజూ తనిఖీ చేసి నకిలీ విత్తనాలుంటే నిర్వాహకులపై పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, భైంసా ఏసీపీ కిరణ్ఖారే, డీఎస్పీ జీవన్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఏడీఏలు, ఎస్ఐలు, ఏవోలు పాల్గొన్నారు.
పల్లె ప్రగతిపై సమీక్ష
కలెక్టర్ కార్యాలయంలో పల్లె ప్రగతి నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం గ్రామాల్లో ప్రత్యేకాధికారులు పనులను పర్యవేక్షించాలన్నా రు. నిత్యం పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వార్డు సభ్యులు అన్ని వార్డులను తిరిగి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కలు నాటడం, పాఠశాలలను శుభ్రం చేయడం లాంటి పనులను చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో శ్రీలత, డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
మండలంలోని న్యూలోలం గ్రామ సమీపంలో నిర్మల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ పరిశీలించారు. నిర్ణీత సమయంలో 100 శాతం కొనుగోళ్లు పూర్తి చేసిన సంఘం పనితీరును అభినందించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి తరలించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ కరీం, ఆర్ఐ సంతోష్కుమార్, నిర్వాహకులు అశోక్, లడ్డు నరేశ్, గంగాధర్ తదితరులున్నారు.