నిర్మల్ టౌన్, మే 24 : నిర్మల్ జిల్లాలో 2021-22 యాసంగి, వానకాలం సీజన్లకు సంబంధించిన బియ్యం పెండింగ్ చాలానే ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. 2021 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు సీఎంఆర్ పెండింగ్ గడువును పెంచినప్పటికీ సంబంధిత రైస్మిల్లర్లు ఆ బియ్యాన్ని అప్పగించలేదు. దీంతో ఈ సారి చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2021-22 యాసంగికి సంబంధించిన 6,23,470 క్వింటాళ్ల బియ్యాన్ని రైస్మిల్లర్లకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 5,98, 429 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 25,040 క్విం టాళ్ల బియ్యం పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భైంసా, ముథోల్ మండలాల్లో ఉన్న రెండు రైస్మిల్లుల్లోనే ఈ బియ్యం పెం డింగ్లో ఉంది. దీంతో సత్వరం సీఎంఆర్ బియ్యం అప్పగించాలని కోరుతూ శాఖ అధికారులు రైస్మిల్లర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. 2021-22 వానకాలం సీజన్కు సంబంధించిన 8,59,943 క్వింటాళ్ల బియ్యానికి గాను ఇప్పటివరకు 3,71,367 క్వింటాళ్లు మాత్రమే తిరిగి అప్పగించారు. ఇంకా 48,8579 క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 48 రైస్ మిల్లులుండగా.. 43 రైస్మిల్లులో సీఎంఆర్ బి య్యం నిల్వ ఉంది. దీంతో దానిని వెంటనే సరఫరా చేయాలని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు సూచిస్తున్నారు.
లక్ష్యం కోసం స్పెషల్ డ్రైవ్..
నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం పెండింగ్పై జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుతో పాటు డీఎస్వో సుధారాణి రైస్మిల్లులకు కేటాయించిన ధాన్యంలో తిరిగి రావాల్సిన సీఎంఆర్ బియ్యం, పెండింగ్ లో ఉన్నదాన్ని గుర్తించారు. పెండింగ్ బియ్యాన్ని వెంటనే ఎఫ్సీఐకి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మిల్లింగ్ చేసి ఏరోజుకారోజు బియ్యం రిపోర్టును తీసుకుంటూ ఎఫ్సీఐ అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తున్నారు. ఈ నెల 30లోపు గడువు ఉన్న నేపథ్యంలో సీఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్మిల్లులకు ఈ యాసంగికి సంబంధించిన ధాన్యం కూడా అప్పగించబోమని వారికి సూచనప్రాయంగా తెలుపుతున్నారు. రాష్ట్ర పౌర సరఫరలశాఖ కమిషనర్ ప్రతిరోజూ దీనిపై జిల్లాల వారీగా నివేదికను కోరనున్న నేపథ్యంలో రోజువారీ పురోగతిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గడువులోపు ఇవ్వాల్సిందే..
ఈ నెల 30లోపు సీఎంఆర్ పెండింగ్ బియ్యం ఇవ్వాల్సిందే. నిర్మల్ జిల్లాలో యాసంగి, వానకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం రైస్ మిల్లుల నుంచి సేకరిస్తున్నాం. ఇందులో 2021-22 సంవత్సరానికిగాను సుమారు 51లక్షల మెట్రిక్ టన్నులకు పైగానే బియ్యం పెండింగ్లో ఉంది. దీనిని గడువులోపు ఇవ్వాలని రైస్మిల్లర్లను ఆదేశించాం.
– సుధారాణి, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి, నిర్మల్