నిర్మల్ టౌన్, మే 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండ్లిబాజా మోగనున్నది. ఈ ఏడాదిలో కుదిరిన పెండ్లిల్ల్లో, ఈ నెల 25వ తేదీ మంచి రోజు కావడంతో వేలాది వివాహాలు జరుగనున్నాయి. వివాహాలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కొందరికి ఫంక్షన్హాళ్లు దొరకకపోవడంతో ఇంటి వద్ద, పంట చేనుల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో టెంట్లు వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో 150కి పైగా ఫంక్షన్ హాళ్లుండగా, అన్నీ నెల రోజుల ముందుగానే బుకింగ్ చేసుకోవడంతో కొందరు ఉదయం పెళ్లి చేసుకోగానే ఖాళీ చేయించి, రాత్రి పెళ్లిలకు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అభిజిత్ లగ్న ముహూర్తం..
శుభకారనామ సంవత్సరంలో ఈ నెల 25వ తేదీన పెండ్లి ముహూర్తాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అభిజిత్ లగ్న ముహూర్తంతో పాటు కర్కాట లగ్న ముహూర్తాలు, పిల్లల ఏ పేరుతో ఉన్నా మార్చకుండానే అన్ని శుభగడియాలు ఉండడంతో పెద్దఎత్తున పెండ్లిలు చేస్తున్నారు. ఇది ఎంతో శ్రేష్టమైన ముహూర్తమని నిర్మల్కు చెందిన పురోహితుడు ఆచార్య కల్యాణ్ తెలిపారు. ఉదయం 10:59 నుంచి 12:30 గంటల వరకు దాదాపు ఎనిమిది ముహూర్తాలు ఉన్నట్లు వివరించారు. లగ్నముహూర్తం ఉన్నా పెళ్లి చేసుకోవడం ఎంతో శ్రేష్టమైనదని తెలిపారు. పెద్ద ఎత్తున పెండ్లిళ్లు ఉండడంతో నిర్మల్ పట్టణంలో వ్యాపార, డెకరేషన్, పూల దుకాణాలు సందడిగా కనిపిస్తున్నాయి. పెండ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. ముహూర్తాలు గంట లోపే ఉండడంతో పంతుళ్లను పిల్లల తల్లిదండ్రులు ఎంపిక చేసుకుంటున్నారు. కొందరు పంతుళ్లు అదే ముహూర్తంలో 2-3 లగ్గాలు చేస్తామని ఒప్పుకున్నారు.
చాలా శుభపరిణామం..
శుభకరనామ సంవత్సరంలో లగ్న ముహూర్తం ఉండడం చాలా శుభపరిణామం. 25న నేను ఒక్కడినే 25 లగ్గాల ముహూర్తాలను తీసి ఇచ్చాను. ఈరో జు పెళ్లిలు చేసుకున్న వారికి అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది.
– ఆచార్య కల్యాణ్, పురోహితులు, నిర్మల్