కుభీర్, మార్చి 4 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) ప్రభుత్వ పాఠశాలలో ఆరేండ్ల క్రితం 17 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునే వారు. శిథిలమైన భవనాలు, పెచ్చులూడుతున్న పైకప్పులు, సరిపడా లేని ఫర్నిచర్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, కంపౌండ్ వాల్ లేకపోవడం, ఉపాధ్యా యుల కొరత, మరమ్మతుకు నోచుకోని కంప్యూటర్లు, తదితర సమస్యలు రాజ్యమే లేవి. దీనికితోడు ఆంగ్ల మాధ్యమం చదువుకోవాలంటే కుభీర్, పల్సి, భైంసా, బోధన్ వంటి పట్టణాలకు వెళ్లేవారు. బడిలో విద్యార్థుల సంఖ్య తగ్గడాన్ని గమనించిన ప్రధానో పాధ్యాయుడు మంద నరేశ్ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ, యువకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులతోపాటు దాతలతో సమావేశం అయ్యారు. బడి బతకాలంటే ఆంగ్ల మాధ్యమం ఒక్కటే మార్గమని సూచించాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టించాడు. అదనంగా ఉపాధ్యాయులను ఇవ్వలేమని చెప్పడంతో ఆంగ్లం బోధించే విద్యావలంటీర్లను నియమించుకున్నారు.
17 నుంచి 120కి పెరిగిన విద్యార్థులు
ఆంగ్ల మాధ్యమం బోధనతో విద్యార్థుల సంఖ్య 17 నుంచి 120కి చేరింది. విద్యా వలంటీర్లకు గ్రామస్తులే డబ్బులు పోగు చేసి, జీతం చెల్లిస్తున్నారు. రెండేండ్ల తర్వాత సర్కారు ఆంగ్ల మాధ్యమం బోధించే ఉపాధ్యాయుడిని నియమించింది. మరో ఇద్దరు వీవీలను పంపడంతో ఒక ప్రైవేటు వలంటీర్ను నియమించుకున్నారు. గ్రామస్తుల సహకారంతో కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీలతో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా పాఠాలు బోధిసున్నారు. దీనికి తోడు ఎస్ఎంసీ పాఠశాల చుట్టూ ఫెన్సింగ్ వేయించడంతోపాటు కొద్దిపాటి ఫర్నిచర్ను సమకూర్చింది.
దీంతో ఆవరణలో మొక్కలు నాటి పెంచడం ప్రారంభించారు. ఇంగ్లిష్ మీడియం ప్రారంభం నుంచి గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ సభ్యులు, హెచ్ఎంతో కలిసి యేటా జూన్లో ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని తెలుపుతున్నారు. ఇలా అవగాహన కల్పించడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యేటా 5 నుంచి 10 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికవుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 50 మందికిపైగా చేరారు. ఇటీవల ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఈ పాఠశాలల ఎంపిక చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడిలో మరిన్ని సౌకర్యాలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు, అదనపు తరగతి గదులు, పాఠశాల చుట్టు ప్రహరీ సమకూరుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతో బడిని బతికించుకున్నం..
తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో మూతబడబోతున్న బడిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి బతికించుకున్నం. డబ్బులు పోగు చేసి విద్యావలంటీర్లను నియమించుకున్నం. ఫెన్సింగ్ వేసినం, మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సమస్యలన్నీ తీరి పోతాయన్న నమ్మకం కలిగింది. – మంద నరేశ్, హెచ్ఎం, పార్డి(కె)
యేడాదికి రూ.30వేలు పోతుండె..
నాకు ఇద్దరు పిల్లలు. వారిని ఇంగ్లిష్ మీడియం చదివించాలని కుభీర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లా. ఒక్కొక్కరికి రూ.15వేలు ఫీజు కట్టమన్న రు. ఇక్కడే ఇంగ్లిష్ మీడియం స్టార్ట్ అయ్యిందని చెప్పగానే ఇక్కడే చేర్పించా. మధ్యాహ్న భోజనం, దుస్తులు, గురుకుల కోచింగ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వమే అన్ని బడుల్లో ఇంగ్లిష్ బోధనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరం సంతోష పడుతున్నం. డబ్బులు బాగా ఆదా అవుతాయని సీఎం కేసీఆర్ను అందరూ పొగుడుతున్నరు. – మెంచు మహేశ్, పోషకుడు, పార్డి(కె)