కూలీలకు వేతనాలను పెంచిన ప్రభుత్వం
కరోనా సమయంలో భరోసా..
దస్తురాబాద్, ఏప్రిల్ 25 : చేతుల కష్టాన్ని నమ్ముకొని బతికే కూలీలకు ఆపత్కాలంలో ఆదుకునేలా రాష్ట్ర ప్రభు త్వం ఈజీఎస్ దినసరి వేతనాలను పెంచి వారి కుటుంబాలకు అండగా నిలిచింది. కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడిన కూలీలకు ప్రభుత్వం పెంచిన వేతనాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఉపాధి హమీ పనులను విస్తృతంగా చేపట్టింది. గతంలో ప్రభుత్వం దినసరి కూలి రూ. 237 చెల్లించేది. ఏప్రిల్ నుంచి రూ. 245కు పెంచి చెల్లించనుంది. కరోనా కారణంగా కూలీల కుటుంబా లు ఇబ్బంది పడ్డాయి. ప్రభుత్వం వీరి కష్టాలను గుర్తించి వేతనాలను పెంచడంతో నిరుపేద కూలీల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
గ్రామాల్లో జోరుగా ఉపాధి పనులు
మండలంలోని దస్తురాబాద్, దేవునిగూడెం, మల్లాపూర్, గొడిసెర్యాల, ఆకొండపేట, రేవోజిపేటలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాలతో పాటు అటవీ, పంట భూముల్లో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భూగర్భ జలాలు పెంచేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా చర్యలు తీసుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూలీలు ఉదయమే పనులకు వెళ్తున్నారు. ఫాంపాండ్, కందకాల నిర్మాణాలతో అనేక లాభాలున్నాయని సంబంధిత అధికారులు ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
మండలంలో 5737 మంది కూలీలు
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి సొంతూళ్లకు వచ్చిన వలస కూలీలకు చాలా మందికి జాబ్కార్డులులేవు. దీంతో సంబంధిత అధికారులు వారికి జాబ్ కార్డులను మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో 298 గ్రూపుల్లో 5737 మంది కూలీలు ఉన్నారు. 2376 మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని గొడిసెర్యాల గ్రామ పంచాయతీలో 231 మంది, రేవోజిపేట గ్రామపంచాయతీలో 262 మంది, భూత్కూర్ గ్రామ పంచాయతీలో 152 మంది, దస్తురాబాద్ గ్రామ పంచాయతీలో 485 మంది, దేవునిగూడెం గ్రామ పంచాయతీలో 155 మంది, ఆకొండపేట గ్రామపంచాయతీలో 164 మంది కూలీలు ఫాంపాండ్, కందకాలు తదితర నిర్మాణాల పనులు చేస్తున్నారు.