మార్గదర్శకాలు జారీ చేసిన అధికారులు
కూలీలకు టీకాపై అవగాహన కల్పించాలి
నార్నూర్, ఏప్రిల్ 25: కరోనా వైరస్ రెండో దశ ఉధృతిని తట్టుకునేలా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కూలీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వేసవిలో ఉపాధి హామీ పనులు చేయడానికి గతంలో కంటే పెద్దసంఖ్యలో కూలీలు వస్తున్నారు.
ఈ పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎంపీవో, ఎంపీడీవో, ఏపీవోలు కూలీలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
టీకాపై అపోహలు తొలగించాలి…
నార్నూర్, గాదిగూడ మండలాల్లోని 48 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఓవైపు కొవిడ్ ప్రభావం..మరోవైపు ఉపాధి పనుల లక్ష్యం పూర్తి చేయాలనే ఉద్దేశం. ఇంకోవైపు కూలీలు కరోనా బారిన పడకూడదనే ఆశయం. మరోవైపు పని ప్రదేశాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగానే కొవిడ్పై అపోహలను తొలగిస్తూ కూలీలకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 45ఏండ్లు దాటిన వారు టీకా వేసుకునేలా చూడాలన్నారు. పనులకు వచ్చే కూలీలు మాస్కులు ధరించేలా, పని చేసే చోట భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీలలో ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించుకొని స్వీయ నిర్భంధం పాటించేలా చూడాలని అధికారులు సూచించారు.