నిర్మల్ జిల్లాలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని చింతకుంటవాడలో ఆంజనేయ శివ పంచాయతన నవగ్రహ ఆలయ వార్షికోత్సవానికి గురువారం ఆయన హాజరయ్యారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన మంత్రిని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పూరతనమైన చింతకుంటవాడ ఆలయాన్ని రూ.30లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో రూ.50కోట్లతో 600 ఆలయాలు నిర్మించుకున్నామని, నిరాదరణకు గురైన ఆలయాల్లో తెలంగాణ ప్రభుత్వం ధూపదీప నైవేద్యాల ద్వారా పూర్వవైభవం తీసుకువచ్చామని తెలిపారు. ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, విజయలక్ష్మి పోశెట్టి, క్లాస్వన్ కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, నాయకులు గండ్రత్ రమేశ్, అయ్యప్ప ఆలయ గురుస్వామి పీఎన్ మూర్తి, మెంగ రమేశ్, ఆలయ అధ్యక్షుడు రాజేశ్వర్, మెంగ రాములు, కందుల రాజేశ్వర్ పాల్గొన్నారు.