దస్తురాబాద్,మే 8 : రైతులకు గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశించారు. గురువారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘గన్నీ సంచుల కొరత..ఎగబడ్డ రైతులు’ అనే కథనం ప్రచురితం అయింది. కథనానికి జిల్లా అధికారులు వేగంగా స్పందించారు. గురువారం మండలంలోని రేవోజిపేట గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కొనుగోల కేంద్రంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. తేమ శాతం వచ్చిన గన్నీ సంచులు ఇవ్వడం లేదని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకపోవడంతో అధికారులు, నిర్వాహకుల పైన ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తేమ శాతం వచ్చిన రైతులకు గన్నీ సంచులను అందించాలని ఆదేశించారు. తేమ శాతం వచ్చిన రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. లారీల కొరత,గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. రెండు లారీలలో ధన్యాం బస్తాలను లోడ్ చేసి తక్షణమే రైసు మిల్లుకు పంపించాలన్నారు.అలాగే గన్నీ సంచులు సైతం గోదాం నుండి తెప్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం పంపిన రిపోర్టులను, గన్నీ సంచుల రిపోర్టును అందించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. కాగా పీఏసీఏస్ సీఈవోకు నోటిసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. డీసీవో కల్లె పాపయ్య, డీఎం సుధాకర్,డిప్యూటీ తహసీల్దార్ యాదవ రావు, సీనియర్ అసిస్టెంట్ సంతోశ్, రైతులు,తదితరులు ఉన్నారు. కాగా, నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి జిల్లా అధికారులు వేగంగా స్పందించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.