నిర్మల్, జనవరి 7(నమస్తే తెలంగాణ): పేదరికంతో పాటు నిరుద్యోగాన్ని ఎదుర్కొన్న ఆ యువకుడు.. తాను అనుభవించిన ఆకలి కష్టాలు మరొకరికి రావద్దని భావించాడు. అన్నార్థులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. బ్యాంకు కొలువు వచ్చిన తర్వాత ఇంట్లోనే ప్రత్యే కంగా భోజనం తయారు చేయించి, తను వెళ్లే దారిలోని నిరుపేదలు, అభాగ్యులకు అందించా డు. అనంతరం తన భావాలతో కలిసిన మరికొంత మంది యువకులను కలుపుకొని ‘ఫుడ్బ్యాంక్ నిర్మల్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశా డు పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీధర్ రాథోడ్. మొదట తన ఇంట్లోనే ప్రతి రోజూ కొంత ఆహారాన్ని తయారు చేయించేవాడు. విడి విడిగా ప్యాక్ చేయించి తాను బ్యాంకు కు వెళ్లే దారిలో కనిపించే పేదలు, యాచకులకు ఈ ఆహార పొట్లాలను అందించే వాడు. ఇలా మొదలైన ఫుడ్బ్యాంక్ ఆశయం క్రమంగా విస్తరించింది.
అతని ఆశయానికి మిత్రులు గుగ్లావత్ రవీందర్, దేదావత్ వీరన్న, మాముల రమేశ్, సుంకరి గణేశ్, సంజీవ్, కాసం ముత్యం, హరిచరణ్, ఉప్పు శిరీష, వై రమేశ్, స్వరాజీ, మహారాజు రవి, మహేందర్, రాథోడ్ అంబు, దినేశ్, రితేశ్ తోడయ్యారు. వీరంతా కలిసి ఫుడ్బ్యాంక్ నిర్మల్ పేరిట ప్రతి ఆదివారం మురికి వాడలు, రోడ్ల పక్కన గల పూరి గుడిసెల్లో జీవించే నిరుపేదలు, ఇతర ప్రాంతాల నుంచి కూలీ పనులకు వచ్చే పేదలకు ఆహార పొట్లాలను అందిస్తున్నారు. భోజనంతో పాటు అవసరమైన వారికి దుప్పట్లు, బట్ట లు కూడా దాతల సహకారంతో పంపిణీ చేస్తున్నా రు.ప్రస్తుతం ఈ ఫుడ్బ్యాంకులో 30మంది వలంటీర్లు స్వచ్ఛందంగా ఆహారం పంపిణీలో పాల్గొంటున్నారు. ఫుడ్బ్యాంక్ ఏర్పాటు చేసి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇకపై ప్రతి రోజూ పేదలకు అన్నదానం చేయాలని ఫుడ్బ్యాంక్ నిర్వాహకులు నిర్ణయించారు. తమ సంస్థ ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 8 నుంచి ప్రతి రోజు అన్నదానం చేయాలన్న నిర్ణయానికి వచ్చామని వారు చెబుతున్నారు. కరోనా కష్ట కాలంలోనూ ఫుడ్బ్యాంక్ సభ్యులు వేలాది మంది అభాగ్యులు, వలస కూలీలకు భోజనం అందించి అందరి మన్ననలు అందుకున్నారు. నిరాటంకంగా కరోనా భయాన్ని ఎదుర్కొని వీరు చేసిన భోజన సహాయ సాహసం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది.
సెలవు దినం.. సేవకు అంకితం..
శ్రీధర్ రాథోడ్తో పాటు భోజన సేవలో అడుగులేస్తున్న మిత్రులు కూడా ఉద్యోగులే. ఆదివారం రోజును వీరంతా ప్రత్యేక దినంగా ఎంచుకున్నారు. ‘సెలవు దినం… సేవకు అంకితం’ పేరిట ప్రత్యేక భోజనాన్ని తయారు చేయించి నిర్మల్కు నాలుగు వైపులా గల పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఫుడ్బ్యాంక్ నిర్మల్ సంస్థలో సేవా భావా లు ఉన్నవారి పుట్టిన రోజులు, పెళ్లి రోజు వేడుకలను జరుపుకునే విధంగా కూడా చూస్తున్నారు. వీరిచ్చే విరాళాలతో ఆదివారం ప్రత్యేక భోజనాన్ని తయారు చేయిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి తాము సంపాదించే జీతం నుంచి ప్రతీ నెల కొంత జమ చేయడమే కాకుండా, స్వచ్ఛందంగా దాతలిచ్చే విరాళాలతో ఫుడ్బ్యాంక్ నిర్వహణను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
ఆకలి బాధ తెలిసినందునే..
ఆకలి బాధ తెలిసినందునే ఫుడ్బ్యాంక్ ఏర్పా టు ఆలోచన వచ్చింది. అమ్మ, నాన్న, భార్యతో పాటు మిత్రుల సహకారంతో ఫుడ్బ్యాంక్ రూపుదిద్దుకున్నది. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా ఉచిత భోజనం అందించడం ఎంతో ఆనందాన్నిస్తున్నది. తనతో పాటు మరో 20 మంది మిత్రులు ప్రస్తుతం ఫుడ్బ్యాంకు నిర్వహణలో భాగస్వా మ్యం పంచుకుంటున్నారు. నా నెలవారి జీతం నుంచి కొంత మొత్తం ఈ ఫుడ్బ్యాంకు నిర్వహణకు ఖర్చు చేస్తున్నాను. ఎవరైనా దాతలు ముం దుకు వస్తే వారి సాయం కూడా తీసుకుంటు న్నాం. నిరుపేద అభాగ్యులకు కడుపునిండా భోజ నం అందిస్తున్న అనుభూతి అనిర్వచనీయం. అన్నార్థులకు ఆకలి తీర్చే ఈ మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలనుకునే వారు 96031 91980లో సంప్రదించాలి.
-శ్రీధర్ రాథోడ్, ఆదర్శనగర్, నిర్మల్, ఫుడ్బ్యాంక్ వ్యవస్థాపకుడు