నిర్మల్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. ఈ సీజన్లో 85 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 50 వేల ఎకరాల్లో నాట్లు వేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సీజన్ ప్రారంభం నుంచే వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ప్రయోజనాలు కలిగే సాగు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించారు. ప్రధానంగా రెండుమూడేళ్లుగా దమ్ము చేసిన పొలంలో వరి గింజలను నేరుగా వెదజల్లే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 9 వేల ఎకరాల్లో ఈ పద్ధతిలో సాగు చేయించి రైతులు లబ్ధిపొందేలా చర్యలు తీసుకున్నారు. ఈ యాసంగిలో కూడా 10వేల ఎకరాల్లో సాగు చేయించేలా లక్ష్యం పెట్టుకున్నారు. కాగా, ఇప్పటికే 8వేల ఎకరాల్లో రైతులు ఈ విధానంలో సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. రైతులు ఇప్పటి వరకు వరి నారు మడిని పెంచి, పొలంలో నాట్లు వేస్తూ వస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల సాగునీరు సరైన సమయంలో అందక, వ్యవసాయ కూలీల కొరత, నారు పెంచి నాటు వేసేందుకు అధిక రేట్లు, ఇతర పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావడం వల్ల సాగు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ క్రమంలో విత్తనాలు వెదజల్లే పద్ధతి సులవైన మార్గమని, అధిక దిగుబడి పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, 61 క్లస్టర్లలో శ్రీకారం చుట్టారు.
తగ్గనున్న పెట్టుబడి ఖర్చు..
వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చు చాలావరకు తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారి అంజీప్రసాద్ చెబుతున్నారు. నాట్లు వేసే పద్ధతిలో ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరమవగా, వెదజల్లే పద్ధతిలో 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. నాటే ముందు ట్రాక్టర్ కేజ్వీల్తో దమ్ము చేయించే ఖర్చు, నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు మిగిలిపోతుంది. దీంతో ఈ విధానంలో ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. కూలీల సమస్య లేకుండానే సమయానుకూలంగా ఈ విధానంలో వరి సాగు చేపట్టవచ్చు. అలాగే 10 రోజుల ముందుగానే ఈ విధానంలో పంట చేతికొస్తుంది. రెండో పంట వేసుకునేందుకు కూడా అవకాశం కలుగుతుంది. ఈ విధానంలో 25 నుంచి 30 శాతం వరకు నీటి వాడకం తగ్గుతుందని అధికారి పేర్కొంటున్నారు.
రెండేళ్లుగా సాగు..
నాకు నిర్మల్ శివారులోని సిద్ధాపూర్లో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అధికారుల సూచనల మేరకు నాటు వేసే విధానం కాకుండా రెండేళ్లుగా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్న. ఎకరానికి రూ.5 వేల నాటు ఖర్చు తగ్గింది. కేజ్వీల్తో దమ్ము కొట్టే అవసరం లేకుండానే సాగు చేయడం వల్ల ట్రాక్టర్ ఖర్చు కూడా మిగిలింది. దిగుబడి ఎకరానికి రెండు క్వింటాళ్లు అధికంగా వస్తున్నది.
– జీ రవీందర్, రైతు, సిద్ధాపూర్