ఎదులాపురం, జూన్ 15 : నకిలీవిత్తన విక్రయదారుల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆదిలాబాద్లోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. మొత్తం 9 మంది సభ్యుల ముఠాలో ప్రధాన నిందితుడితోపాటు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. 792 ప్యాకెట్ల పింక్ బాండ్ పత్తి విత్తనాల ప్యాకెట్లతోపాటు.. రూ.9.5 లక్షల విలువ చేసే ఎక్సై్పరీ విత్తనాలు, మందులను స్వాధీనం చేసుకున్నామని, మొత్తం విత్తనాల విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందన్నారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడు పాపిన్వర్ సునీల్ కుమార్తోపాటు.. రాథోడ్ పండిత్, రాథోడ్ బాలాజీ, గిరీశ్ పటేల్, ఈశ్వర్ను అరెస్టు చేశామని, సందేశ్ బండేవర్, గణేష్, కృష్ణ, కిరణ్ పరారీలో ఉన్నారని పేరొన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కే.నాగరాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు అఖిల్, గోపికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
బేల మండలంలో..
బేల, జూన్ 15 : రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ మధుకృష్ణ తెలిపారు. ఈనెల 1న బేల బస్టాండ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన కమలాకర్ ఓం జాదవ్ వద్ద నుంచి 25 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13న అంబేదర్ చౌక్ వద్ద నిర్వహించిన దాడిలో మహారాష్ట్రకు చెందిన రాహుల్ దఖారే, వినోద్ మధుకర్ పెచే, దినర్ కవడు పెచేలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 56 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఒక కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి తాము అధికారిక డీలర్లమని రైతులను నమ్మించి విక్రయిస్తున్నట్లు తేలింది. రెండు చోట్ల 81 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఒక కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇచ్చోడ మండలంలో..
ఇచ్చోడ, జూన్ 15 : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, 58 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ ఎస్హెచ్వో కే.నరేశ్ కుమార్ తెలిపారు. ఈనెల 14న ధాబా(బీ)కి చెందిన నర్వాటే ఈశ్వర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 34 పింక్ బాండ్ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు లభించగా, వాటిని ఆదిలాబాద్కు చెందిన పాపిన్ వార్ సునీల్ కుమార్ నుంచి కొన్నట్లు తేలిందన్నారు. సుమారు 300 ప్యాకెట్లను విజయ్కు విక్రయించినట్లు తెలిపాడు. సోమవారం సాయినగర్కు చెందిన రాథోడ్ గణేశ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 24 పింక్ బాండ్ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకోగా, వాటిని కూడా పాపిన్ వార్ సునీల్ కుమార్ నుంచి కొని రైతులకు విక్రయించినట్లు అంగీకరించాడన్నారు. ఇప్పటికే సుమారు 100 ప్యాకెట్లను వివిధ వ్యక్తులకు విక్రయించినట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో నర్వాటే ఈశ్వర్, రాథోడ్ గణేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, ప్రధాన సరఫరాదారుగా గుర్తించిన పాపిన్ వార్ సునీల్ కుమార్ మరో కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్నాడని తెలిపారు. పరారీలో ఉన్న విజయ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.