నిర్మల్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు : మంత్రి ఐకే రెడ్డి
ఆదిలాబాద్ : పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ సేవలు ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ను మంజూరు చేయడంతో బీసీ సంఘాల నేతలు మంత్రిని కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు జిల్లాలోనే బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు కానుండటంతో పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.