కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్
స్టడీ మెటీరియల్ అందజేత
నిర్మల్ అర్బన్, మే 20 : ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం తప్పకుండా వస్తుందని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని శుక్రవారం వారు సందర్శించారు. ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశ్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. స్టడీ మెటీరియల్ కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్ పరీక్షలకు ఉపయోగపడుతుందని, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన కలెక్టర్కు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి, వశిష్ట విద్యాసంస్థల ప్రిన్సిపాల్ డాక్టర్ అఖిలేశ్ సింగ్, అధ్యాపకుడు భూమన్న, ఆర్ఐలు హతీరాం, రామకృష్ణ, రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం
ఇచ్చోడ, మే 20 : ఉద్యోగ అవకాశాలను యువత వినియోగించుకోవాలని, పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధించవచ్చని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక వివేకానంద డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు, జిల్లా పోలీసులకు మంచి పేరు తేవాలని సూచించారు. యువతీయువకులు పోటీ పరీక్షలకు సంసిద్ధులై ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పోలీస్ శాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని సీఎం కేసీఆర్ రెండేళ్లు పొడిగించారని తెలిపారు. కార్య క్రమంలోఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఇచ్చోడ, బోథ్ సీఐలు ముదావత్ నైలు, రమేశ్ బాబు, ఎస్ఐ ఉదయ్ కుమార్, ఏఎస్ఐ లింబాద్రి, సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.