కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 40 లక్షల పనిదినాలను కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 1.23 లక్షల జాబ్ కార్డులుండగా, దాదాపు 2.52 లక్షల మంది కూలీలు ఉన్నారు.
ప్రతి కూలీకి పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పనుల్లో పారదర్శకత కోసం ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతిరోజూ పనుల పురోగతి, కూలీల హాజరును నమోదు చేయనున్నారు. జాబ్కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గతంలోకంటే భిన్నంగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రజాప్రతినిధులను సంప్రదించి నివేదికలు తయారు చేశారు. గ్రామాల్లో ఎలాంటి పనులు కావాలో అడిగి తెలుసుకొని ప్రణాళికలు రూపొందించారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి పెద్దపీట వేశారు.
స్వచ్ఛత, పచ్చదనంతో పాటు భూగర్భ జలాలు పెంపొందించేలా పనులు చేపట్టనున్నారు. అలాగే ఇంకుడు గుంతలు, పొలాలు చదును చేయడం, కంపోస్టు పిట్లు, పండ్ల తోటలు, పశువుల పాకలు, గొర్రెలషెడ్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, నర్సరీల అభివృద్ధి, పాఠశాలల్లో వంటగదులు, రైతుల చేళ్లల్లో వరద కాలువల ఏర్పాటు వంటి పనులను చేపట్టనున్నారు.