రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా.. నీతివంతమైన పాలన అందించేందుకు అత్యంత అద్భుతంగా నిర్మించిన కలల సౌధం.. కాకతీయ, ఇండోయూరోపియన్, పార్శన్ అర్కిటెక్చర్ విధానాన్ని అనుసరించి 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆరు అంతస్తులతో నిర్మితమైన మహా కట్టడం.. అదే హైదరాబాద్ నడిబొడ్డున దర్శనమిస్తున్న మహోన్నత నిర్మాణం మన నూతన సచివాలయం. దళితుల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసేలా కొత్త సెక్రటేరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేయడం కేసీఆర్ సమున్నత దృష్టికి తార్కాణం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రగతిని చాటేలా అత్యాధునిక సౌకర్యాలతో కట్టిన సచివాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించడం శుభపరిణామం. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం ఇనుమడించేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో నిర్మించుకోవడం గర్వించ దగ్గ విషయం. ఈ సందర్భంగా దళితమేధావుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
– ఆదిలాబాద్/నిర్మల్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ)
రాష్ట్రాన్నికి ఒక తేజం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వం 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం అనేది నిస్సందేహంగా రాష్ర్టానికి, దేశానికి గర్వకారణమైన విషయం. కొత్త సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం అనేది జాతికి గర్వకారణం. ఆదివారం సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించడం జాతికే పండుగే. అంబేద్కర్ చరిత్ర చదివి, రాజ్యాంగ ఔన్నత్యం తెలుసుకొని ప్రభావితం అయిన వారిలో నేనొకడిని. డిగ్రీ తర్వాత స్వయం ఉపాధితో ఆధార్ సెంటర్ చూసుకుంటూ.. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఉన్నా. 300 మంది సభ్యులు ఉన్న సంఘం మాది. అన్ని కులాలు, మతాలు సమానం అన్న బాబా సాహెబ్ బోధనలతో మేము అన్ని వసతి గృహాల్లో సంఘం ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో నిర్మాణమైన పరిపాలన సౌధం చరిత్రలో నిలిచిపోతోంది. దళిత, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వపరంగా చేయూత అవసరం.
– సృజన్ పాటిల్, తాంసి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మించిన కొత్త సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రాత్మకం. అంబేద్కర్ కలల సౌధంగా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఈ నూతన పాలనా సౌధం రాష్ర్టానికే తలమానికంగా దర్శనమిస్తున్నది. రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలన అందించేందుకు అద్భుతంగా నిర్మించిన ఈ కట్టడం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతోంది. ఇంతటి చారిత్రక నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలన్నీ అభినందిస్తున్నాయి. మహోన్నత కట్టడానికి అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టడంతో దళితుల ఆత్మగౌరవం రెండింతలైంది. తెలంగాణ ప్రగతి చిహ్నంగా మరిన ఈ కొత్త సచివాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా పలువురు దళిత మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
– ఆదిలాబాద్/నిర్మల్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ)
దళితుల ఆత్మగౌరవం రెట్టింపయ్యింది..
హైదరాబాద్ నడిబొడ్డున సర్వహంగులతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి డాక్టర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేయడంతో దళితుల ఆత్మగౌరవం రెండింతలైంది. ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం కేవలం పరిపాలనా ధక్షులకు మాత్రమే సాధ్యమవుతోంది. తెలంగాణ చరిత్రలోనే చరిత్రాత్మక నిర్మాణం. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కేంద్ర సర్కారు కాపీ కొడుతున్నది. సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం రైతుబంధు పథకాన్ని తీసుకొస్తే… కేంద్రం పీఎం కిసాన్ తెచ్చింది. అలాగే ఇప్పుడు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.
– డాక్టర్ రమేశ్, చిన్నపిల్లల వైద్యులు, నిర్మల్.
చరిత్రలో నిలిచిపోతోంది..
భారతదేశమే గర్వించదగ్గ విధంగా సీఎం కేసీఆర్ నూతన సెక్రటేరియట్కు డాక్టర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేశారు. అన్ని హంగుల తో పాలనా సౌధాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించడంపై తెలంగాణ సమాజం హర్షిస్తున్నది. రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛమైన, నీతివంతమైన పాలనను అందించేందుకు నిర్మించిన ఈ కట్టడం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతోంది. ఇంతటి చారిత్రక నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు అండగా ఉంటాయి. కొత్త సచివాలయం తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా విస్తరించడమే కాకుండా, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
– తాల్ల రవి, ఉపాధ్యాయుడు, నిర్మల్.
అద్భుత కట్టడాల్లో ఒకటి..
కొత్త సచివాలయాన్ని కాకతీయ, ఇండోయూరోపియన్, పార్శన్ ఆర్కిటెక్చర్ విధానాన్ని అనుసరించి 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా నిర్మించారు. ఈ పాలనా సౌధం ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటిగా చేరిపోతోందని అనడంలో సందేహం లేదు. ఈ కట్టడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టడం చరిత్రాత్మకం. ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధా నానికి, రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితం. అంబేద్క ర్ భారీ విగ్రహం, రాష్ట్ర పాలనకు వేదిక కానున్న సచివాలయం ఒకే వరుసలో ఉండడం శుభపరిణామం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రగతిని చాటే విధంగా కట్టడం ఉండడం ద్వారా ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందాలి.
– డాక్టర్ తుమ్మల దేవరావ్, చరిత్ర పరిశోధకుడు, నిర్మల్.
ఒక అపూర్వ ఘట్టం..
హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించటం చరిత్రలో అద్భుత ఘట్టం. ఇక ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభించడం కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును సచివాలయానికి పెట్టే ఆలోచన ఇదివరకు ఏ రాష్ర్టాల సీఎంలకు రాలేదు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. దళితబంధు, దళితబస్తీ లాంటి పథకాలను సాహసోపేతంగా అమలు చేస్తున్న రాష్ట్రం మనది ఒక్కటే. కేసీఆర్ ఆలోచనలు, అభివృద్ధి పథకాలు యావత్ భారతదేశానికి అత్యంత ఆవశ్యకం. బీఆర్ఎస్ నేతగా కేసీఆర్ భారత ప్రధాని కావాలని, పార్లమెంటుకూ అంబేద్కర్ పేరు పెట్టాలనేది నా ఆకాంక్ష.
– దుర్గం శేఖర్, అంబేద్కర్ ఉత్సవ సమితి చైర్మన్, ఆదిలాబాద్.
శుభపరిణామం
బోథ్, ఏప్రిల్ 30 : తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామం. దేశంలో ఎక్కడా లేని విధంగా బాబాసాహెబ్ పేరు నిత్యం ప్రజల్లో నిలిచేలా గుర్తింపునివ్వడం హర్షణీయం. చిన్న రాష్ర్టాల ఏర్పాటు ఆవశ్యకతను ఆనాడే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చారు. దీనికి అనుగణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్కు ఆయన పేరు పెట్టి రుణం తీర్చుకున్నట్లుగా భావించవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు.
– చిట్టి సాగర్, టీచర్, బోథ్.
చరిత్రలో నిలిచిపోతోంది..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన అంసెబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడం దేశ చరిత్రలో నిలిచిపోతోంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే దేశంలో పాలన కొనసాగుతున్నప్పటికీ, గతంలో పాలకులెవరూ ఆయన గొప్పతనాన్ని గుర్తించలేదు. పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాత్రమే అంబేద్కర్ గొప్పతనాన్ని గుర్తించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తెలంగాణ ఏర్పాటుకు దోహదం పడింది. అంబేద్కర్ గొప్పతనానికి చిహ్నంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఇప్పుడు అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక గుర్తింపునిచ్చింది. దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు దేశంలో కేసీఆర్ ఒక్కరే. అందుకే తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.
– బసార్కర్ విశ్వనాథ్, నేతకాని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు