ఇంద్రవెల్లి, జనవరి 4 : కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాపూర్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నాగోబా ఆలయ ఆవరణలో 10న ఉదయం 10:30 గంటలకు తైబజార్తోపాటు కొబ్బరికాయలు, వాహనాల పార్కింగ్ స్థలం, విద్యుత్ కనెక్షన్, రంగుల రాట్నాల స్థలానికి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వంతోపాటు, దేవాదాయ శాఖ, ఐటీడీఏ అధికారులు నిర్ణయించిన ప్రకారం ధరలు చెల్లించాలన్నారు. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, నాగోబా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేలం డిపాజిట్ వివరాలు..
వేలంలో పాల్గొనే వ్యాపారులు ముందుగానే డిపాజిట్ చెల్లించాలని ఆలయ ఈవో రాజమౌళి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తైబజార్కు రూ.50 వేలు, కొబ్బరికాయలు రూ.50 వేలు, వాహన పార్కింగ్కు రూ.20వేలు, విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.20 వేలు, ప్యాలాలు, పుట్నాలు విక్రయించేందుకు రూ.10 వేలు, కొబ్బరి ముక్కలు పోగుచేసేందుకు సంబంధించి వేలానికి రూ.10 వేలు డిపాజిట్గా చెల్లించాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నిర్ణయించిన ధరావత్తు సొమ్ము(డిపాజిట్)ను చెల్లిస్తేనే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని వెల్లడించారు.