బైంసాటౌన్, డిసెంబర్ 4 : ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని, నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనిస్తున్నట్లు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దేగాంలో లబ్ధిదారులకు రూ.6.13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతూ సరైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందజేస్తామని పేర్కొన్నారు. పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో సైతం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ సాయినాథ్, డైరెక్టర్ చాకేటి లస్మన్న, నాయకులు నంగి రాజేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో అన్నదానం
కుంటాల, డిసెంబర్ 4 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కల్లూర్లో శ్రీ దత్త జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ నెల 7న జరిగే దత్త జయంతి మహోత్సవాలు, దత్త జననం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.