కుభీర్, జూలై 18 : ఆరుగాలం కష్టించి పనిచేసే రైతన్న వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తుంటే.. సాగును తీవ్ర సంక్షోభంలోకి నెట్టి రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమైందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నిగ్వ గ్రామంలోని రైతువేదికలో ‘రైతు సభ’ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మాయ మాటలతో రైతులను ఆగం చేసే కుట్రలకు కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు రద్దవుతుందని, దీనికి సాక్ష్యం ఇటీవల రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలేనని పేర్కొన్నారు.
యాబై ఏండ్లు అధికారంలో ఉన్న సమయంలో కరెంటు, ఎరువులు, సాగు, తాగు నీరుకు ఇబ్బందులు పడ్డ రైతాంగం.. మరోసారి మోసపోయే అవకాశం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అనేక రైతు పథకాలను తీసుకొచ్చి ‘వ్యవసాయం దండగ కాదు.. పండుగ’ అనే స్థాయికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైతులు ముక్తకంఠంతో రేవంత్ క్షమాపణలు చెప్పాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని రైతుసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.