భైంసా, నవంబర్ 3 : ‘పాండురంగ దేవుడు పైన ఉన్నాడు. కానీ కనిపించే దేవుడు కేసీఆర్ మనందరి ముందర ఉన్నారు. ప్రజలకు అండగా ఉంటున్నరు..’ అని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో శుక్రవారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో చేయలేని సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మాయమాటలకు లొంగకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూడాలని ప్రజలకు సూచించారు. అధికార దాహంతో ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని ఆరోపించారు. దేశం గర్వించే రీతిలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని గుర్తుచేశారు. మరోసారి కేసీఆర్ను సీఎం చేయాలని కోరారు. అలాగే ముథోల్ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్, బాలికల రెసిడెన్షియల్ ఏర్పాటు చేయాలని, అలాగే గుండేగాం ముంపు గ్రామానికి రూ.90 కోట్ల జీవో విడుదలైందని, వెంటనే రిలీజ్ చేయాలని, 28 ప్యాకేజీ పనులు ఆగిపోయాయని, టెండరు పిలిచి మిగితా పనులు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.
సిరాల ప్రాజెక్టు పంట నష్టమైతే రూ.11 కోట్లు అంచనా వేశామని, 8 చిన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలన్నారు. రూ. 20 కోట్లతో గడ్డెన్నవాగు ప్రాజెక్టు లైనింగ్ పనులు పూర్తి చేశామని, ఇంకా కొంత లైనింగ్ చేస్తే సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. బాసర ఆలయాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారని, ఇంకా రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరయ్యాయని, మరో 2 వేల ఇండ్లు మంజూరుచేయాలన్నారు. ఎస్టీ గిరి వికాస్ గృహాలు మంజూరు చేయాలని, భైంసాలో ఐఐటీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.
మహారాష్ట్రకు చెందిన ఎస్టీలు 30 ఏండ్ల నుంచి తెలంగాణలో ఉంటున్నారని, వారికి ఎస్టీ సర్టిఫికెటుల ఇవ్వాలన్నారు. ఈ ఆశీర్వాద సభలో మాజీ ఎంపీ జీ నగేశ్, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, పడకంటి రమాదేవి, విలాస్ గాదేవార్, మురళి గౌడ్, బామ్ని రాజన్న, కొత్తపల్లి బుచ్చన్న, తూము రాజేశ్వర్, అనిల్, పిప్పెర కృష్ణ, తోట రాము, ఫారూఖ్, ఎజాజ్ హైమద్, ఆళా తదితరులు పాల్గొన్నారు.