నార్నూర్ : ప్రజలకు జవాబుదారిగా పని చేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల కళాశాల పనుల్లో నాణ్యత లోపంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని ప్రతి పాఠశాలలో కొవిడ్కు ముందు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్టాక్పై విచారణ చేపట్టాలని ఎంపీడీవో రమేశ్కు సూచించారు.. ఈ విషయాన్ని డీఈవో దృష్టి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. తాడిహత్నూర్లోని 38సర్వే నంబర్కు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఫోన్లో కోరారు.
సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీ చేయాలని వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ జిల్లాలోనే నార్నూర్ మండలాన్ని అభివృద్ధిలో ముందజలో ఉంచేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మండల అధికారులు, మండల ప్రగతి, సంక్షేమ పథకాలను వెల్లడించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, మిషన్ భగీరథ డీఈ వెంకటేశ్వర్ , ఏవో గిత్తే రమేశ్, ఎంఈవో రాపెల్లి ఆశన్న, ఐటీడీఏ ఏఈ జాదవ్ సునీల్, పీఆర్ ఏఈ జాడి లింగన్న, ఏపీఎం రమేశ్, ఏపీవో జాదవ్ శేషారావ్, వైద్యుడు విజయ్కుమార్, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.