సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 13 : వేసవి నేపథ్యంలో నస్పూర్ పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 25 వార్డులకు సంబంధించిన ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్యలు తెలుసుకొని వారికి సలహాలు, సూచనలు చేశారు.
మున్సిపల్ పరిధిలోని మొత్తం 25 వార్డుల్లో పైపులైను లీకేజీలు లేకుండా చూడాలన్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్న చోట ప్రత్యేక దృష్టిసారించాలని, ఆయా వార్డులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.