ఇచ్చోడ, డిసెంబర్ 12 : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని నమ్మించి ద్రోహం చేసిన బీజేపీతో తాడో పేడో తేల్చుకోవడానికి మాదిగ జాతి సిద్ధం కావాలని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇచ్చోడ, బోథ్, బజార్హత్నూర్ మండలాల సదస్సును గంగారెడ్డి గార్డెన్లో పాలేపు గణేశ్ మాదిగ అధ్యక్షతన సోమ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం శాంతియుతంగా 28 ఏండ్లుగా మాదిగ జాతి చేస్తున్న పోరాటం దేశ చరిత్రలో అమోఘమైనదన్నారు. పాలకులకు చిత్తశుద్ధి, నిజాయితీ లేకపోవడంతో వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతూనే ఉందని, కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తూ దగా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాఉ. బీజేపీ మెడలు వంచి వర్గీకరణను సాధించుకోవాలన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా బీజేపీ నేతలు మాదిగల దగ్గరకు రావద్దని స్పష్టం చేశా రు. రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగలేదనని చెప్పారు.
తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి కేవలం మాదిగలకు మాత్రమే ఉంద న్నారు. మాదిగలను దూరం చేసుకుంటే బీజేపీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేశ్ మాదిగ, ఇచ్చోడ, బజార్హత్నూర్ మండలాల ఇన్చార్జి బరుకుంట సుభాష్, కన్వీనర్ చిట్టి రవి, దుబ్బాక చందు, ఇంద్రవెల్లి మండల ఇన్చార్జి ఉప్పులేటి శ్రీను, నేరడిగొండ ఇన్చార్జి గజ్జెల అశోక్, దుర్గయ్య, సుంకె అనిల్, ఎమ్మెస్పీ నాయకులు కాంబ్లే బాలాజీ, దుబాక సుభాష్, గోటిముక్లే మధుకర్, గోనె అడెల్లు, ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగు గంగయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ పసుల శ్రీకాంత్, పవన్ పాల్గొన్నారు.