కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను ఆధునీకరించడంతో పాటు కొత్తవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే రాత్రివేళల్లో వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నియంత్రిస్తుండగా, ఇక ఆయా చెక్పోస్టుల వద్ద నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. వాహనదారుల నుంచి చార్జీల వసూలులో భాగంగా ఫాస్టాగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు.
-కడెం, ఆగస్టు 11
కడెం, ఆగస్టు 11: అటవీ సంపదను కాపాడేందుకు నిఘా మరింత పటిష్టం చేయనున్నారు. కడెం రేంజ్ పరిధిలో ఇప్పటికే ఉన్న అటవీశాఖ చెక్పోస్ట్ను ఆధునీకరిస్తూ కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణాన్ని అదే గ్రామ సమీపంలో ఏర్పాటు చేశారు. దేశంలో 42వ టైగర్ జోన్గా ఏర్పాటైన కవ్వాల్ టైగర్ రిజర్వు (కేటీఆర్) పరిధిలో కడెంతో పాటు ఉడుంపూర్, జన్నారం, ఇందన్పెల్లి, ఉట్నూర్, ఖానాపూర్, పెంబి, మామడ అటవీ పరిధిలోని రేంజ్ కార్యాలయాలున్నాయి. ఈ టైగర్ జోన్ను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. కడెం మండలంలో ఇప్పటికే రెండు రేంజ్ కార్యాలయాలను ఏర్పాటు చేయగా, కడెం రేంజ్ పరిధి పాండ్వాపూర్ వద్ద ఇప్పటికే అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్పోస్ట్ ఉంది. అది కడెం వంతెన సమీపంలో కొనసాగుతున్నది. అటవీ సంపదను కాపాడేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని కడెం మండలంలోని పాండ్వాపూర్, జన్నారం మండలంలోని తపాల్పూర్, ఉట్నూర్ మండలంలోని కొత్తగూడెం గ్రామాల్లో ప్రధాన చెక్పోస్ట్లున్నాయి. వీటి పరిధిలోనే నిఘా మరింత పటిష్టంగా కొనసాగుతున్నది.
అభయారణ్యం పరిధిలో రాత్రి సమయాల్లో వాహనాలను నిలిపివేసేందుకు గతంలోనే అటవీశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. వన్యప్రాణులు రాత్రి సమయాల్లో స్వేచ్ఛగా తిరిగేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వాహనాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు. పగటి సమయాల్లోనైతే అసలు లారీలు, ఇతర భారీ వాహనాలను పూర్తిగా నిషేధించారు. ఈ పాండ్వాపూర్ చెక్పోస్ట్ నుంచి నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోకి వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఈ జిల్లాల పరిధిలోనే కవ్వాల్ టైగర్ జోన్ ఉండడంతో వాహనాల నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్నిరకాల వాహనాలకు అనుమతులున్నాయి. ఆ తర్వాత మాత్రం అటవీ పరిధిలోకి ఎలాంటి వాహనాలకు అనుమతుల్లేవు. భారీ వాహనాలు, లారీలకు మాత్రం ఎలాంటి సమయాల్లోనూ అనుమతులు నిషేధించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాల ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కడెం మండలంలోని దస్తురాబాద్ను మండలంగా ఏర్పాటు చేసింది. కానీ ఈ మండలంలో పెద్దగా ఫారెస్ట్ లేని కారణంగా రాత్రి సమయాల్లో ఆ మండలానికి చెందిన ప్రజలు వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని బావించిన అధికారులు.. ఆ మండల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ రోడ్డును క్రాస్ చేసి మంచిర్యాల, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేసేలా నూతనంగా చెక్పోస్ట్ను నిర్మించారు. ఈ నిర్మాణంతో అటవీ సంపదను కాపాడడంతో పాటు రాత్రి సమయాల్లో వాహనాలను నిలిపివేయడం, వన్యప్రాణుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోనున్నారు.
కవ్వాల్ అభయారణ్యం పరిధిలో వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్టాగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్టాగ్ ఆధారిత సేవలను ప్రారంభించడంతో వాహనాల సుదీర్ఘ క్యూలైన్లు, జాప్యాలను నివారించవచ్చు. తెలికపాటి వాహనాలకు రూ.50, ఇతర వాహనాలకు రూ.80 చొప్పున ఫాస్టాగ్ రుసుం వసూలు చేయనున్నారు. పర్యావరణ నివారణ చార్జీల కోసం దీనిని ఏర్పాటు చేయనున్నారు. అటవీశాఖ చెక్పోస్ట్లో నేషనల్ హైవే టోల్గేట్ల మాదిరిగా ఫాస్టాగ్ సేవలను అనుసంధానం చేయడంతో టోల్ ఫీజు చెల్లింపునకు ఇబ్బందులు తీరనున్నాయి.
కడెం రేంజ్ పరిధిలోని పాండ్వాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన అటవీశాఖ చెక్పోస్ట్ను వారంలోగా ప్రారంభిస్తాం. ఇప్పటికే పనులు పూర్తికాగా, వారంలో సామగ్రిని షిఫ్ట్ చేయిస్తాం. ఇరువైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘాను మరింత పటిష్టం చేస్తాం. త్వరలోనే అటవీశాఖ ఉన్నతాధికారులతో దీనిని ప్రారంభించనున్నాం.
– సీహెచ్ అనిత, రేంజ్ అధికారి, కడెం