తలమడుగు, జూలై 29 ;రుయ్యాడి జనసంద్రమైంది. ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పీరీలను దర్శించుకోవడానికి బారులుదీరారు. సవారీలను పురవీధుల గుండా ఊరేగించగా.. ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించగా.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అస్సైదులా.. అంటూ పీరీల ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలో ముగిశాయి. రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే రుయ్యాడి గ్రామంలో పీరీల ఉత్సవాలు శనివారం ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి పీరీలను దర్శించుకున్నారు. రుయ్యాడి గ్రామం భక్తులతో జన సంద్రంగా మారింది. ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక క్యూలో పీరీలను దర్శించుకున్నారు. పీరీలకు మొక్కిన మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గ్రామంలోని పలు వీధుల గుండా పీరీలను ఊరేగించారు. పలువురు ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీ జీ నగేశ్, ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పీరీలను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదానం చేశారు. ఎస్ఐ ధనశ్రీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కుచులపూర్, తలమడుగు, సుంకిడి, దేవాపూర్ తదితర గ్రామాల్లో ఈ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు.