సహజ, మానవ వనరులు పుష్కలంగా ఉన్న నిర్మల్ జిల్లాలో సైన్స్ సెంటర్, ప్లానిటోరియం ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు సంకల్పించగా, కేంద్రం అడ్డుపుల్లలు వేయడం విమర్శలకు తావిస్తున్నది. రూ. 50 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు అవరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా అంగీకరించింది. కాగా, దీనికి అనుమతినివ్వాల్సిన కేంద్ర శాస్త్ర సాంకేతిక అభివృద్ధి శాఖ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. మూడేళ్లుగా సైన్స్సెంటర్పై ఎలాంటి కదలిక లేకపోవడం, కేంద్రం నిర్లక్ష్య ధోరణి స్థానికుల అసంతృప్తికి కారణమవుతున్నది.
నిర్మల్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్, ప్లానిటోరియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్రంలో సైన్స్ సెంటర్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన కక్ష సాధింపు ధోరణితో ఈ సెంటర్ మంజూరుకు ప్రతిబంధకాలు సృష్టిస్తుండడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్ శివారులోని చించోలి (బి) ఆర్టీవో కార్యాలయం సమీపంలో దాదాపు రూ.50కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న సైన్స్ సెంటర్ కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. సెంటర్ ఏర్పాటుకు సంబంధించి పరిపాలనా పరమైనటువంటి అనుమతులను కూడా మంజూరు చేసింది. అయితే కేంద్ర శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి శాఖ ద్వారా ఈ సెంటర్కు అనుమతి లభించాల్సి ఉంది. దీంతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన అనుమతులతో పాటు పూర్తి స్థాయి నిధులను కూడా కేంద్రమే అందించాలి.
సైన్స్ సెంటర్ ఏర్పాటుకు ప్రాథమిక అవసరాలైన స్థల సేకరణ, ఇతర మౌళిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇందుకోసం అవసరమైన రాష్ట్ర వాటాను భరించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన అంగీకారాన్ని తెలిపింది. ఇందులో భాగంగానే ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి అవసరమైన అంచనాలను రూపొందించింది. దాదాపు మూడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కేంద్రం మాత్రం ఈ దిశగా స్పందించకుండా పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుండడం స్థానికుల అసంతృప్తికి కారణమవుతున్నది. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత,మేధస్సును, శాస్త్ర, సాంకేతిక రంగాల అభిరుచులను వెలికి తీసేందుకే కాకుండా సరికొత్త ఆవిష్కరణల కోసం ఈ సైన్స్ సెంటర్ను ఉపయోగించాలని తలపెట్టారు. అయితే ఈ సైన్స్ సెంటర్లోనే ఓ ప్లానిటోరియంను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది నిర్మాణమైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ ప్రతిష్టాత్మక సైన్స్ సెంటర్ నిర్మల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. కాగా కేంద్ర ప్రభుత్వం తన సహాయ నిరాకరణ ప్రక్రియలో భాగంగా నిర్మల్ సైన్స్ సెంటర్ ప్రతిపాదనను కనీస స్థాయిలో కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సైన్స్ సెంటర్ కోసం నిర్మల్లో కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్)
రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సైన్స్ సెంటర్ విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంపై పలువురు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. కాగా హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్ కోసం 25 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తేనే నిర్మల్ సైన్స్ సెంటర్కు అనుమతులు, నిధులు మంజూరు చేస్తామని కేంద్రం తాజాగా మెలిక పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లుగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా ఈ సైన్స్ సెంటర్ విషయమై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ర్టానికే చెందిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కిషన్రెడ్డిని కూడా పలుమార్లు కలిసి నిర్మల్ సైన్స్ సెంటర్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. అయినప్పటికీ కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో సైన్స్ సెంటర్ ఏర్పాటుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించి ఉమ్మడి జిల్లాలోని అపారమైన సహజ వనరులు, మేధస్సుకు పదును పెట్టేందు కోసం ప్రతిపాదించిన సైన్స్ సెంటర్కు అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయాలని పలువురు విద్యావేత్తలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా వనరులు, మేధస్సుకు వేదికగా…
నిర్మల్లో ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్ ఇక్కడి విద్యార్థులకు ఓ సాంకేతిక వేదికగా మారనుంది. నూతన ఆవిష్కరణలకు ప్రధాన వేదిక కానుంది. జిల్లాలో ఉన్న సహజ వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంతో పాటు ప్రస్తుత సమాజానికి శాస్త్ర, సాంకేతిక రంగాలను సద్వినియోగం చేసే దిశగా కొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్ నాంది పలికే అవకాశం ఉన్నది. జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు పొరుగు రాష్ర్టాలకు, విదేశాలకు వెళ్లి స్టార్టప్లు స్థాపించి తమ మేధస్సును ఇతర ప్రాంతాలకు పంచుతున్నారన్న వాదనలు ఉన్నాయి. అయితే ఇక్కడే సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తే జిల్లా స్థాయిలోనే అనేక స్టార్టప్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మేధోమథనంతో పాటు మేధో సంపత్తి విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ సైన్స్ సెంటర్ పరిశోధనా కేంద్రంగా కూడా మారే అవకాశం ఏర్పడుతుంది.
హైదరాబాద్తో ముడి పెడుతున్నరు..
కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదు. చివరికి విద్యార్థులకు ఉపయోగపడే సైన్స్ సెంటర్ లాంటి సంస్థలపై కూడా రాజకీయాలు చేస్తున్నది. సెంటర్కు మొదట ఓకే చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆటంకాలు సృష్టిస్తున్నది. సైన్స్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చించోలి వద్ద ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద చేయాల్సిన పనులపై అంచనాలు రూపొందించాం. అన్నీ సవ్యంగా సాగుతున్న క్రమంలో కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. నిర్మల్ సైన్స్ సెంటర్కు హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న సంస్థతో ముడిపెడుతున్నారు. హైదరాబాద్లో రూ.250 కోట్ల నిధులతో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, అప్పటి వరకు నిర్మల్ సెంటర్కు నిధులివ్వమని చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నవోదయ స్కూళ్లను ఇవ్వడం లేదు. కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వడం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ల కోసం విలువైన స్థలాలను ఇచ్చినా ముందుకు రావడం లేదు. మెడికల్ కాలేజీలకు కొర్రీలు పెడుతున్నది. అసలు కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నదో అర్థం కాకుండా పోయింది.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ,పరావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి