ఉట్నూర్, నవంబర్ 9 : ‘రేఖానాయక్.. నువ్వు సీం కేసీఆర్ వల్లే ఎమ్మెల్యే అయినవ్.., జడ్పీటీసీగా ఉన్న నిన్ను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపించిన్రు.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.., అ లాంటి నాయకుడుని పట్టుకొని దుర్భాషలాడడం సమంజసం కాదు..’ అని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, సీనియర్ నాయకులు రవీందర్రావు ఆమె తీరుపై మండిపడ్డారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వా రు మాట్లాడారు. ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీలో సభలో సీఎం కేసీఆర్ను ఓరేయ్.. అంటూ సంబోధించడం మంచి పద్ధతి కాదని వార్నింగ్ ఇచ్చారు. తండ్రి లాంటి వ్యక్తిని తిట్టడం సరికాదని సూచించారు. ‘ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్కు బంట్రోత్ అంటావా.., అవును.. మేము ప్రజలకు బంట్రోత్లుగా పనిచేస్తాం.., నీ లాగా వ్యక్తిగత స్వార్థానికో, కమీషన్ల కోసమో పనిచేయబోం.., ఇప్పటికైనా ప్రజా సంగ్రామంలో కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి..’ అని డిమాండ్ చేశారు. ఇలాంటి నాయకుల గురించి ఖానాపూర్ ప్రజలకే వదిలేస్తున్నామన్నారు. మొదటి నుంచి ఖానాపూర్లో బీఆర్ఎస్కు ప్రజల ఆదరణ ఉన్నదని, పథకాలే తమ అభ్యర్థి జాన్సన్ నాయక్ను గెలిపిస్తాయని వెల్లడించారు.
ఇక రేవంత్రెడ్డి చదువుకున్నోడిలా లేడని విమర్శించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గాల్లో ఆదివాసీ అభ్యర్థులకు రేవంత్రెడ్డి అన్యాయం చేశారని విమర్శించారు. ‘ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అమెరికా నుంచి వచ్చారని అంటున్నారు. మీ పార్టీలో 40 మంది అభ్యర్థులు అక్కడి నుంచి వచ్చారు. మరి వారికి టికెట్ ఎలా ఇచ్చారు..’అని ప్రశ్నించారు. ఇకపై కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కేసీఆర్ను సేవాలాల్, తెలంగాణ గాంధీగా పొగిడినప్పుడు ఏమైందన్నారు. తమ పార్టీకి గిరిజనులు, గిరిజనేతరులు రెండు కండ్లలాంటి వారని పేర్కొన్నారు. ఎవరికీ నష్టం లేకుండా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్, పెంబీ జడ్పీటీసీ జానుబాయి, భరత్ చౌహాన్, పెందూర్ ప్రభాకర్, పుర్క బాపురావ్, పుష్పారాణి, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్రావు, మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, తిరుపతి, దాసండ్ల ప్రభాకర్, ధరణీ రాజేశ్, సెడ్మకి సీతారాం, సింగారే భరత్, అమీనాబి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.