బెజ్జూర్, మార్చి 27 : రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు (గురువారం) కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు,కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి దండె విఠల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం బెజ్జూర్ మండలానికి వచ్చారు. కార్యకర్తలతో కలిసి సమావేశంపై చర్చించారు.
సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి జోగు రామన్నతో పాటు ఇటీవల బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశానికి హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. బీఆర్ఎస్ నాయకులు సామల రాజన్న, ఖాజా సమీయొద్దీన్, చిప్పకుర్తి దేవాజీ, తేలి రాజేశ్, నీలయ్య, ఆనంద్ రావు, రౌతు లచ్చయ్య, మెరుగు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.